భీమవరం (ప్రకాశంచౌక్): కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఈఎస్జెడ్ ప్రకటన ప్రక్రియలో భాగంగా ప్రతిపాదనల ఖరారు కోసం శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలు, అభ్యంతరాలు, సూచనలను సమగ్రంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలి పరిధిలోకి వచ్చే పెంటపాడు, గణపవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల్లో 2025 జనవరి 6 నుండి 8 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, ఏలూరు జిల్లా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ అధికారి, మెంబర్ కన్వీనర్ డాక్టర్ ఎ.త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


