జంగారెడ్డిగూడెం: సొసైటీలో అవినీతి, అక్రమాలు, అధికారుల విచారణ తదితర అంశాలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా సహకార అధికారి ఎ.శ్రీనివాస్ స్టేట్మెంట్ నమోదు చేశారు. స్థానిక డీసీసీబీ బ్యాంకు కార్యాలయ భవనంలో శుక్రవారం ఫిర్యాదుదారులను విచారించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని డీసీసీబీ పరిధిలో ఉన్న పెనుగొండ, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం సొసైటీలతో పాటు 11 సొసైటీల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై 2023–24లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ 51 ఎంకై ్వరీ ఆర్డర్తో విచారణకు ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా విచారణాధికారులగా నియమించిన వారు సరిగా విచారణ చేయలేదని టి.నరసాపురం మండలం వెలగపాడుకు చెందిన న్యాయవాది బొడ్డు శ్రీనివాసరావు 2025లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. అలాగే జంగారెడ్డిగూడేఇకి చెందిన నేట్ర గణపతిరావు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏలూరులో ఏజీఎంగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్ 2008లో తన ఉద్యోగానికి రాజీనామ చేసిన తర్వాత కూడా తిరిగి విధుల్లోకి ఏ నిబంధనలు అనుసరించి తీసుకున్నారు? ఏ నిబంధనలు ప్రకారం పదోన్నతి ఇచ్చారు? అని తెలపాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ఫిర్యాదుదారులను విచారించామని, విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన తెలియజేశారు.


