ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంటలో మెగా బయో ఇన్ఫుట్స్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ)లో గురువారం ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే పీఎండీ నవధాన్యాల సీడ్ కిట్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు. తొలి విడతగా 800 పీఎండీ కిట్లు సిద్ధం చేశారు. ప్రతి కిట్లో 15 కిలోల బరువైన 25 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కో కిట్ను రూ. 1,400 కు రైతులకు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎండీ నవధాన్యాల విత్తనం వల్ల రైతులకు అనేక లాభాలు కలుగుతాయన్నారు. నవధాన్యాల పంటలు వేసుకోవడం ద్వారా నేల ఎర్రదనం తగ్గి, సంవత్సరం పొడవునా భూమి పచ్చగా కప్పబడి ఉంటుందన్నారు. 365 రోజులు భూమి కప్పబడి ఉండటం వల్ల నేల నష్టం తగ్గి, భూతాపాన్ని తగ్గించడంలోనూ, ప్రకృతి విపత్తులను తట్టుకునే శక్తిని పెంచడంలోనూ పీఎండీ నవధాన్యాల కిట్లు కీలక పాత్ర పోషిస్తాయని వెంకటేష్ తెలిపారు.
దెందులూరు: మండలంలోని గోపన్నపాలెంలో ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం గోపన్నపాలెంలోని శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల గ్రౌండ్, సోమరప్పాడుకాలనీ, పీఈటీ గ్రౌండ్, గాలాయిగూడెం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం జనాభా నిర్వహణ–ప్రతిపాదిత గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ పాల్గొన్నారు.


