పెనుమంట్ర: నత్తరామేశ్వరం గ్రామంలో గోస్తనీ నదిలో కొలువైయున్న (సప్త కోటేశ్వర) శ్రీ రామలింగేశ్వర స్వామికి దాతలు రూ.36 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలను సమర్పించారు. గ్రామానికి కర్రి అచ్చిరెడ్డి, లక్ష్మి తులసి దంపతులు 6 కిలోల వెండితో కవచం, కర్రి అప్పిరెడ్డి, లక్ష్మీ కాంతం దంపతులు 6 కిలోల వెండితో నాగాభరణాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించారు. సోమవారం ప్రత్యేక పూజల అనంతరం వాటిని స్వామికి అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ద్వారంపూడి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తమలపూడి నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.
తొలి సోమవార పూజలు : గోస్తని నదిలో వేంచేసి ఉన్న శ్రీ సప్త కోటేశ్వర లింగానికి వైశాఖమాస పర్వదినం పురస్కరించుకుని తొలి సోమవార పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి.
ఏలూరు టౌన్: ఏలూరు శివారు క్రాంతి కళ్యాణమండపం సమీపంలో ఖాళీ స్థలంలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉంది. పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించటంతోపాటు, క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు టౌన్: మహిళా పోలీస్స్టేషన్ పట్ల మహిళలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయ సమీపంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మహిళ పోలీస్స్టేషన్కు మంగళవారం ఉదయం 7 గంటల నుంచీ రంగులు వేసేందుకు మహిళలు, విద్యార్థులు, యువత, చిత్రకారులు, సృజనాత్మకత కలిగిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మహిళల భద్రత, చైతన్యం, గౌరవాన్ని ప్రతిబింభించేలా గోడలను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.


