ఏలూరు (ఆర్ఆర్పేట): పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ద్వారకాతిరుమల తీసుకువెళ్లిన యువకుడు, అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూరల్ మండలం పోణంగికి చెందిన 21 ఏళ్ల యువతి పదో తరగతిలో ఉండగానే నక్క దీపక్ ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అతని వేధింపులు తాళలేక తల్లిదండ్రులు చదువు మాన్పించి దుకాణంలో పనికి పెట్టారు. కొంతకాలం క్రితం నుంచి దీపక్ వెంట పడడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మింది. ఈనెల 13వ తేదీన దీపక్ పెద్దలు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని ద్వారకాతిరుమల వెళ్లి పెళ్లి చేసుకుందామని యువతిని ఒప్పించాడు. స్నేహితుడి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమల రావాలని ఆమెకు సూచించాడు. ఆమె ద్వారకాతిరుమల వెళ్లిన తర్వాత ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ఆ రాత్రి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం లేచి చూసేసరికి అతను కనబడలేదు. దీంతో యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం దీపక్ ఇంటికి వెళ్లి విషయం చెప్పగా దీపక్ తల్లిదండ్రులు తమ కుమారుడు హాస్టల్లో ఉన్నాడని నీతో ఆరోజు రాత్రి ఉన్నది ఎవరో సరి చూసుకోమని హేళనగా మాట్లాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందుతుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
భీమడోలు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ అన్నారు. జాతీయ రహదారి సూరప్పగూడెం వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు, గోనె సంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యం కొనుగోలుకు అవసరమైన నాణ్యమైన సంచులను అందుబాటులో ఉంచామన్నారు. తేమ శాతం, ధాన్యం రవాణా విషయంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ, సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


