ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి పనులు కల్పించకుండా కొత్త పద్ధతులు పెట్టి తీవ్ర నష్టం కలిగిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కొత్తగా పెట్టిన ఫేస్ యాప్ వల్ల పని ప్రదేశాల్లో హాజరు పడక జిల్లాలో వేల మంది ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తున్నారని తెలిపారు. నేడు ఉదయం 6 గంటల కెళ్లి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల కెళ్లి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలని బీజేపీ ప్రభుత్వం పేదల గొంతుపై కత్తి పెట్టిందని వాపోయారు. ఫేస్ యాప్, రెండు పూటలా పని రద్దు, అడిగిన అందరికీ పని, పెండింగ్ వేతనాలు, పేస్లిప్స్, పనిముట్లు, ప్రమాదంలో చనిపోతే రూ.25 లక్షల సష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఈనెల 20న విజయవాడ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎ.రవి, కరీముల్లా, షాహినా, తదితరులు పాల్గొన్నారు.


