బుట్టాయగూడెం: సత్యసాయి మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ రెడ్డిగణపవరంనకు చెందిన గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత సంవత్సర కాలంగా సత్యసాయి మంచినీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు కేవీపీఎస్ జిల్లా నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నేషనల్ హైవే రోడ్ల నిర్మాణం వల్ల జరుగుతున్న పనులతో సత్యసాయి నీరు నిలిచిందని సంబంధిత అధికారులు చెబుతున్నారన్నారు. ఈ విషయంపై ఇటు సత్యసాయి వాటర్ప్లాంట్ కాంట్రాక్టర్లు, బ్రిడ్జిలు కట్టే కాంట్రాక్టర్ల దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి సత్యసాయి నీటిని వెంటనే ప్రజలకు సరఫరా చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు పూనెం దుర్గారావు, గ్రామస్తులు ఏ సీతమ్మ, వింజరపు వేణు, కె.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


