ఏలూరు (టూటౌన్): ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన 2025 సివిల్ పెన్షన్ వాలిడేషన్ చట్టం రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పెన్షనర్ల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్కు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు సమర్పించారు. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్ నెంబర్ 14 సీ ని ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఏలూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి ఆంజనేయులు, కే మహాలక్ష్ముడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెన్షనర్లకు బకాయి పడిన నాలుగు డీఏలను, డీఆర్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, పెండింగ్ పడిన ఏరండ్ లీవ్ పేమెంట్లను చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని వారు కోరారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి డి గంగాధర్రావు, జిల్లా నాయకులు ఏ అప్పలరాజు, ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం యూనిట్లకు చెందిన విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.


