కై కలూరు : కొల్లేటకోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో దేవస్థానం కిటకిటలాడింది. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆలయానికి పలురూపాల్లో ఒక్కరోజు ఆదాయం రూ. 2,64.707 వచ్చిందని తెలిపారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత, సరైన మార్గదర్శకం లేని అట్టడుగు వర్గాల అనాథలు, సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలకు ఉన్నత విద్య అందించనున్నట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపర్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు ఎ.సర్వేశ్వరరావు, టీటీఎఫ్ రూజ్వెల్ట్ ప్రకటనలో తెలిపారు. రానున్న పదేళ్లలో 100 మంది ఐఐటీయన్లు, 50 మంది డాక్టర్లను తయారు చేయాలని సంకల్పించామన్నారు. ఈ మేరకు 2026–27 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ఉచిత విద్య కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్టు పేర్కొన్నారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా రాజమండ్రిలో రాత పరీక్ష నిర్వహిస్తామని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని, తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి ఓ భక్తురాలి బంగారపు ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర బంజర్కు చెందిన అనంతోజ్ సౌమ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి క్షేత్రానికి వచ్చారు. సాయంకాలార్చన అనంతరం రాత్రి 7 గంటల సమయంలో క్యూ లైన్లోకి వెళ్లేటప్పుడు ఆమె చేతికున్న ఉంగం చోరీకి గురైంది. ఆ ప్రాంతంలో భక్తులు గుంపుగా ఉండటంతో చోరీ చేసిన వ్యక్తిని గుర్తించలేకపోయారు.
భీమవరం: భీమవరంలోని వోల్గా ఆర్చరీ అకా డమీలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–15, 13, 10 ఆర్చరీ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపికకు పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది బాలబాలికలు ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికవరీ కేటగిరీల్లో తలపడ్డారు. జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీ రు ఈనెల 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆ ర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయ రాజు తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి మోహన్దాస్ క్రీడాకారులను అభినందించారు. కోచ్ లు ఈ.సాహిత్, కమల్ కిశోర్, జయలక్ష్మి పోటీలను పర్యవేక్షించారు.
కాళ్ల: చెరువులో పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం కాళ్లలో చోటుచేసుకుంది. ఎ స్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దొ డ్డనపూడికి చెందిన గుండా సురేష్ (21) కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ, తల్లిదండ్రులను హింస్తూ ఇంట్లో సామాన్లు నాశనం చే స్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చెరువులో పడి మునిగిపోతుండగా అక్కడ క్రికెట్ ఆడుతున్నవారు కేకలు వేశారు. విషయం గమనించిన కొల్లి సాయిరాజేష్ మరికొందరు చెరువులో దూకి సురేష్ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
భీమవరం: యుద్ధం ముసుగులో రొయ్యల ధరలను తగ్గించడాన్ని ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ యుద్ధాన్ని పురస్కరించుకుని సంబంధం లేకపోయినా రొయ్యల ధరలను అమాంతంగా తగ్గించారని విమర్శించారు. 100 కౌంట్కు రూ.25 వరకు తగ్గించారన్నారు. వ్యా పారులు ఇష్టారీతిలో ధరలు ఇస్తున్నారన్నారు.


