యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కుక్కునూరు: మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి తెలంగాణకు రాత్రి వేళ ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. రెండు రో జుల క్రితం మండలంలోని ఇబ్రహీంపేట ర్యాంపు నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లారీలు ర్యాంపులోకి వెళ్లకుండా కేవలం ట్రాక్టర్లు మాత్రమే వెళ్లేందుకు దారిని ఉంచి తక్కిన మార్గాన్ని తవ్వించేశారు. అలాగే అక్రమ రవాణా జరగకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల ఆదేశాలతో తమకేం పని అన్నట్టు ఇసుక మాఫియా శనివారం రాత్రి సమయంలో తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేపట్టినట్టు సమాచారం.
చోద్యం చూస్తున్న అధికారులు
ఇసుక అక్రమ రవాణాపై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలం నుంచి వెళ్తున్న ఇసుక లారీలను గత రెండు నెలల్లో తెలంగాణలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారంటే ఇక్కడి అధికారుల పనితీరు ఎలా ఉందో స్పష్టం అవుతుంది. ఇకనైనా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి రాష్ట్ర సంపదను సరిహద్దులు దాటకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


