విరాళాలను దేవస్థానం ఖాతాలో జమ చేస్తాం
ఆగిరిపల్లి: రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి భక్తులు అందించే కానుకలకు దేవస్థానం తరపున రసీదు అందిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి సీహెచ్ సాయి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 29 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. 26న రథోత్సవం నిర్వహించునున్నట్లు తెలిపారు. అన్నదానానికి భక్తులు అందించే విరాళాలకు ఎలాంటి రసీదులు ఇవ్వమని కొంతమంది అంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి అపోహలు నమ్మవద్దని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అన్నదానానికి భక్తులు అందించిన విరాళాలు రూ.6,24899 దేవస్థానం తరఫున ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే జమ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు.
వేలేరుపాడు: 2024, 2025వ సంవత్సరంలో ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన చెరువులు, రహదారుల పనుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో బయటపడింది. శనివారం వేలేరుపాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రేపాకగొమ్ము సర్పంచ్ సోడే వెంకమ్మ అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో 520 పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఉన్న నూజీవీడు ఏపీడీ శ్రీనివాసరావు వివిధ పనుల రికార్డులు పరిశీలించగా, రూ.26.31 లక్షల అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ పనులు ఎక్కడ చేపట్టారో చూపాలని ఏపీడీ సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం ఇవ్వకపోగా, గోదావరి వరదలకు కొట్టుకుపోయాయని సమాధానమిచ్చారు. దీనిపై ఏపీడీ పూర్తి విచారణకు ఆదేశించారు. ఫీల్డు అస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.22 వేల చొప్పున జరిమానా విధించారు. దుర్వినియోగం చేసిన సొమ్మును ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఆదేశించారు.
పెదపాడు: మండలంలోని అప్పనవీడులో గత నెల 23న రెడ్డి జ్యోతి అనుమానస్పద రీతిలో మృతి చెందడంతో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా భర్త అనిల్, మరో మహిళ పాకలపాటి జ్యోతిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చామని పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు.


