
ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారులు
చాట్రాయి: మండలంలోని పోతనపల్లికి చెందిన గిరిజనులు శనివారం అటవీ భూములను ఆక్రమించుకునే యత్నాన్ని ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. సుమారు 60 మంది ఉదయం అడవిలో తుప్పలు కొడుతుండగా సమాచారం అందుకున్న అధికారులు అడ్డుకోవడంతో గిరిజనులు, అధికారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ్మిలేరు వల్ల తమ భూములు కోల్పోయామని వాటికి ప్రత్యామ్నాయంగా ముంపు భూములను సాగు చేసుకుంటామని చెప్పగా తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అధికారులు ఫారెస్టు అధికారులు జాయింట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అంతవరకు ఆక్రమణలు చేపట్టవద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఇస్తే వనసంరక్షణ సమితి ఏర్పాటు చేసి ఆదాయం కలిగేలా చేస్తామని ఫారెస్టు అధికారులు గిరిజనులకు చెప్పారు. అనంతరం కొంత మందిపై ఆక్రమణలు చేసినందుకు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు.
కొయ్యలగూడెం: అచ్చుతాపురం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన నల్లమాటి రాంబాబు (58) కొయ్యలగూడెం వ్యాపారం నిమిత్తం వచ్చి తిరిగి రాజమండ్రి వైపు వెళుతుండగా గోపాలపురం మండలం బుచ్చంపేట నుంచి కొయ్యలగూడెం వైపు బైక్పై తల్లితో వస్తున్న తామా శ్రీరామ్ ఢీకొట్టాడు. రాంబాబు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 108 సిబ్బంది చేరుకొని గాయపడిన శ్రీరామ్, అతని తల్లిని కొయ్యలగూడెం పీహెచ్సీకి, అక్కడ నుండి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
ఏలూరు రూరల్: ఈ నెల 16న ఏలూరు జిల్లా బాల బాలికల జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రంగారావు, అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. వట్లూరు సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. 2006 జనవరి 1 తర్వాత పుట్టిన వారే పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 99519 31133 నెంబర్లో సంప్రదించాలన్నారు.
చింతలపూడి: విజిలెన్సు, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం చింతలపూడి మండలంలోని ఎరువులు షాపులను తనిఖీ చేశారు. మండలంలోని సీతానగరంలో గణేష్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మి ట్రేడర్స్ షాపుల్లో తనిఖీ చేయగా రూ.15,67,650 విలువ కలిగిన 64.5 టన్నుల ఎరువులు తేడా ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఏఓ మురళీ కృష్ణ తెలిపారు.
జంగారెడ్డిగూడెం: కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయంలోకి వరద నీరు చేరడంతో జలాశయం నీటిమట్టం 82.70 మీటర్లకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 83.5 మీటర్లు కాగా.. ప్రస్తుతం 12,619 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 5,078 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎడమవ కాలువ నుంచి సాగునీటికి 50 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 80 క్యూసెక్కుల విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ రాహుల్ భాస్కర్ తెలిపారు.
బుట్టాయగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో కొండవాగులు పొంగుతున్నందున గుబ్బల మంగమ్మతల్లి దర్శనాలు నిలిపి వేస్తునట్లు బుట్టాయగూడెం ఎస్సై దుర్గా మహేశ్వరరావు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే వర్షాలు తగ్గే వరకు ఆలయ ప్రవేశాలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారులు