పశ్చిమలో పేకాట దందా | - | Sakshi
Sakshi News home page

పశ్చిమలో పేకాట దందా

Aug 6 2025 6:40 AM | Updated on Aug 6 2025 6:40 AM

పశ్చిమలో పేకాట దందా

పశ్చిమలో పేకాట దందా

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్‌నకు రూ.20 వేలు, మిడిల్‌ డ్రాప్‌నకు రూ.40 వేలు, ఫుల్‌ కౌంట్‌కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్‌. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్‌ చేసి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారుతుంది.

భీమవరంలో స్పెషల్‌ శిబిరం

భీమవరంలోని మురుగు కాల్వ గట్టు సమీపంలో ఓ శిబిరం భారీ స్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్‌లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆట సాగుతుంది. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనష్ట బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు. ఓకుకు రూ. 20 వేలు చొప్పున.. ఫుల్‌ కౌంట్‌ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్‌కు రూ.5 లక్షలు డిపాజిట్‌, మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్‌గేమ్‌ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్‌ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడిగా ఉన్న క్లబ్‌లో గెస్ట్‌ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్‌ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు. భీమవరంలో పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తున్నాడు. రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిఽధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్‌ గేమ్‌ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పెరగడంతో కొద్ది రోజులుగా శిబిరాల్ని నడపడం లేదు. మరో అనువైన ప్రదేశం కోసం వేట సాగుతున్నట్లు సమాచారం

ఒక్కొక్కచోట ఒక్కోలా

తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్‌లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం.

టీడీపీ నేతల కన్నుసన్నల్లో శిబిరాల నిర్వాహకులు

భీమవరంలో ఒక్క ఆటకు రూ.1.60 లక్షలు

జిల్లాలో నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌

ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేకాటరాయుళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు

తణుకులో రోజూ మారుతున్న శిబిరాలు

పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా

టీడీపీ కూటమి సర్కారు రాగానే..

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్‌లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనష్ట గేమ్‌ వరకు భారీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement