
స్మార్ట్ బాదుడు
ఏలూరు (టూటౌన్): నాడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టింది అని పిలుపునిచ్చిన కూటమి నాయ కులు.. నేడు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను బిగిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఒకలా, అధికారం చేపట్టాక మరోలా వ్యవహరించడం కూటమి నాయకులకే చెల్లిందంటూ ప్రజలు దుయ్యబడుతున్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రూ.15,485 కోట్ల అదనపు భారాలు మోపి వినియోగదారుల నడ్డి విరిచారని గుర్తుచేస్తున్నారు. తాజాగా అదానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక పేరుతో కొన్ని రోజులుగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనికి కొనసాగింపుగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ వద్ద, జిల్లాలోని వివిధ సబ్ స్టేషన్ల వద్ద స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం ధర్నాలకు పిలుపునిచ్చారు.
పెద్ద ఎత్తున సంతకాల సేకరణ
స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతోంది. వారం రోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారు.
కూటమి నమ్మక ద్రోహం
గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగులకొట్టండని లోకేష్ పిలుపు కూడా ఇచ్చారు. గద్దెనెక్కిన కూటమి నాయకులు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఏడాది కాలంలో కరెంటు బిల్లులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల అంశం తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరులో జిల్లా విద్యుత్ భవనం, జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు.
మీటర్ రీడర్లపై కత్తి
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ మీటర్ రీడర్లు ఉపాధిని కోల్పోనున్నారు. ఏలూరు జిల్లాలో 460 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 400 మంది రోడ్డున పడనున్నారు.
సర్దుపోటు రూ.15,485 కోట్లు
ట్రూఅప్ సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపింది. దీంతో పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
మరింత దోపిడీకి..
రాష్ట్రంలోని కూటమి సర్కార్ ప్రజలను మరింత దోపిడీ చేసేందుకే స్మార్ట్ మీటర్ల బిగింపును తెరమీదకు తీసుకువచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీతో ఒప్పందం చేసుకుని ‘స్మార్ట్’గా ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్లతో బిల్లులు మరింత పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
తక్షణం రద్దు చేయాలి
ప్రజలపై మరింత భారాలు మోపేలా ఉన్న స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం రద్దు చేయాలి. పేదల పొట్ట గొట్టి పెద్దలకు పెట్టినట్టు అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యత్ స్మార్ట్ మీటర్లను తెరమీదకు తీసుకురావడం దారుణం.
– డీఎన్వీడీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు జిల్లా కమిటీ
ప్రజలను మోసగిస్తున్నారు
కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసగించింది. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్ మీటర్లను నిస్సిగ్గుగా బిగించేస్తున్నారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. ప్రతిఒక్కరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి.
– బండి వెంకటేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా కమిటీ
ప్రజలపై విద్యుత్ భారాలు
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను అందరూ విజయవంతం చేయాలి. ఎటువంటి చార్జీలు పెంచబోమని, అదనపు భారాలు మోపబోమని నమ్మబలికిన కూటమి నాయకులు తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి ఎడాపెడా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గం.
– బద్దా వెంకట్రావు, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు
సామాన్యులకు షాక్
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు
ఉపాధి కోల్పోతామంటున్న మీటర్ రీడర్లు
కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్ భారాలు
నేడు జిల్లా విద్యుత్ భవన్,సబ్స్టేషన్ల వద్ద ధర్నాలకు పిలుపు

స్మార్ట్ బాదుడు

స్మార్ట్ బాదుడు

స్మార్ట్ బాదుడు

స్మార్ట్ బాదుడు