
విద్యారంగాన్ని తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ దుయ్యబట్టారు. కుక్కునూరు, వేలేరుపాడు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కడ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్ఎఫ్ఐ సిటీ ప్లీనరీ సమావేశం ఆగస్టు 2, 3 తేదీల్లో సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. శనివారం నిర్వహించిన సిటీ ప్లీనరీ సమావేశంలో లెనిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు కూడా విడుదల చేయకపోవడం కారణం ఏంటని ప్రశ్నించారు. గత సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లు జులై నెలాఖరులోపు పూర్తయ్యాయని ఈ సంవత్సరం ఆగస్టు వచ్చినా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు బి.మనోజ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శివాజీ, జయం శివ, రాజా తదితరులు పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్ఆర్పేట) : రానున్న విద్యాసంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 13 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను పరిపాలన కారణాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే ఉచిత సిమ్ అందిస్తుందని టెలికాం జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక జిల్లా టెలికాం జీఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత సిమ్తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు, 30 రోజుల కాల వ్యవధితో అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్ ఈ నెల ఒకటి నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి
కామవరపుకోట: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సాగులో యాంత్రీకరణ, పకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం రైతులతో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్తో కలిసి పాల్గొని, రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకంలో జిల్లాలోని 1,60,968 రైతులకు రూ.107.08 కోట్లు అందించామని చెప్పారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందిస్తున్నామని, సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో ఇంతవరకు 50 డ్రోన్లు సబ్సిడీపై రైతులకు అందించామన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఇన్చార్జ్ ఆర్డీఓ దేవకీదేవి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ పట్టా భూముల విభజనకు అవకాశం
భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లాలోని రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో వెట్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకొనేందుకు అవకాశం కల్పించారని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూ విభజన కోసం సాధారణంగా వసూలు చేసే రూ.500 ప్రభుత్వ రుసుంను పూర్తిగా మాఫీ చేసినట్లు తెలిపారు. భూ యజమానులు కేవలం రూ.50 నామమాత్రపు దరఖాస్తు రుసుంను గ్రామ సచివాలయంలో చెల్లించి, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక అవకాశం ద్వారా జాయింట్ పట్టాదారులు తమ భూములను విభజించుకుని గ్రామ సచివాలయంలో అర్జీ దాఖలు చేసుకుని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.

విద్యారంగాన్ని తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం