
వాగులే ఆవాసం.. పాములే ఆహారం
● అత్యంత ప్రమాదకరం గిరినాగులు ● పాపికొండల అభయారణ్యంలో సంచారం
గిరినాగు (కింగ్ కోబ్రా) అత్యంత ప్రమాదకరమైన సర్పం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. అరుదైన సర్పజాతికి చెందిన గిరినాగులకు ఇతర పాములే ఆహారం. వర్షాకాలంలో పాములను తినేందుకు ఇవి బయటకు వస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు సమీపంలో వీటి జాడ ఎక్కువగా ఉన్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. అరుదైన గిరినాగులు కనిపిస్తే చంపవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
బుట్టాయగూడెం : ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల మధ్య 1,01,200 హెక్టార్ల పరిఽధిలో పాపికొండల జాతీయ వన్య మృగ అభయారణ్యం విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నిలయంగా ఉన్న ఈ అభయారణ్యంలో గిరి నాగుల సంచారం ఎక్కువగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతాలకు పరిమితమయ్యే ఈ సర్పాలు అత్యంత విషపూరితం. అలాగే ఇవి అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇటీవల ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరినాగులు కనిపించినట్టు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు పరిసర ప్రాంతాలు వీటికి అడ్డాగా మారా యని వైల్డ్ లైఫ్ అధికారులు అంటున్నారు.
ఆహారం కోసం
బయటకు..
మార్చి నుంచి జూలై వరకు గిరినాగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో జల వనరులు తగ్గినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. రబీ సీజన్ అనంతరం ఇతర పాములు పొలాల్లో ఉండటంతో ఆహారం కోసం వాటిని వెతుక్కుంటూ గిరినాగులు వస్తుంటాయి. గతేడాది వర్షాకాలంలో బుట్టాయగూడెం మండలం కేఆర్పురం సమీపంలో, ఇనుమూరు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం అటవీ ప్రాంతంలో, ఇటీవల గడ్డపల్లి, ముంజులూరు, తంగేడికొండ, దారావాడ, కోండ్రుకోట అటవీ ప్రాంతాల్లో గిరినాగులు కనిపించినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో గిరినాగులతో పాటు పది అడుగుల తాచుపాములు, రక్తపింజర వంటి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి.
పట్టుకుని అడవిలో వదిలేస్తూ..
ఇటీవల కాలంలో వర్షాకాలంలోనూ గిరిజనులు పొ లాల్లో సంచరిస్తున్నాయి. వీటి సమాచారం అందిస్తే ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇవి అరుదైన పా ములు కావడంతో వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గిరినాగులు 14 నుంచి 20 అడుగుల పొడవు ఉంటాయి.
మగ గిరినాగులను ఆకర్షించేందుకు ఆడ గిరినాగులు ఫెర్మోన్స్ అనే రసాయన పదార్థాన్ని వెదజల్లుతాయి. ఆ వాసన బట్టి మగ గిరినాగులు వాటిని అనుసరిస్తాయి.
గిరినాగులు కాటు వేస్తే 10 నిమిషాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
గిరినాగులు రక్తపొడ, తాచుపాము, కట్లపాము, జెర్రిగొడ్డు వంటి పాములను ఆహారంగా స్వీకరిస్తాయి.
గిరినాగులు గుడ్లు పెట్టి 18 రోజులపాటు పొదుగుతాయి. 21వ రోజున పిల్లలు బయటకు వస్తాయి.
పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు ప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది.

వాగులే ఆవాసం.. పాములే ఆహారం