
రూ.359కి చేరిన వర్జీనియా ధర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం నాటికి కేజీ ఒక్కింటికి అత్యధికంగా రూ.359కు చేరింది. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రం, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో ఈ ధర రూ.359కు చేరింది. వేలం ప్రారంభ సమయంలో కేవలం కేజీ ధర రూ.290 పలికింది. ఈ ధర చాలా రోజులు స్థిరంగానే కొనసాగింది. కొద్ది రోజులుగా పెరుగుతూ 359కు చేరింది. కేజీ అత్యల్ప ధర రూ.200 ఉండగా, సరాసరి కేజీ ధర రూ.277కు చేరింది. గత ఏడాది వేలం ప్రక్రియ ముగిసే సరికి సరాసరి కేజీ ధర రూ.323 లభించింది. ఈ ఏడాది కూడా సరాసరి ధర అంతే ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.