
అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం
భీమవరం: పట్టణంలో అనాథ మృతదేహానికి శనివారం మానవత సంస్ధ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా అనాథ మృతదేహంగా గుర్తించిన పోలీసులు మానవత సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో–చైర్మన్ కారుమూరి నర్సింహమూర్తిబాబు, అల్లు శ్రీనివాస్ స్పందించి మృతదేహాన్ని ఖననం చేశారు.
చోరీకి గురైన బంగారం స్వాధీనం
ముదినేపల్లి రూరల్ : చోరీకి గురైన బంగారు వస్తువులను స్థానిక పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని చిగురుకోటకు చెందిన గుబిలి సుబ్బారావు భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 6న విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉంచిన 45 గ్రాముల బంగారు నగలు, 50 గ్రాముల వెండి చోరీ చేశారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయగా కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేసి చిగురుకోటకు చెందిన పిండి శ్రీనును శనివారం అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చొరవ చూపిన సిబ్బంది బి.నాగబాబు, సీహెచ్ లక్ష్మీ శ్రీకాంత్, బి.పవన్ను సీఐతో పాటు ఎస్సై వీరభద్రరావు అభినందించారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తణుకు అర్బన్: లారీ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన ఘటన తణుకు జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన మట్టా సత్యనారాయణ (35) స్నేహితుడితో కలిసి తాడేపల్లిగూడెం నుంచి మోటారుసైకిల్పై స్వగ్రామానికి వెళ్తుండగా ఉండ్రాజవరం జంక్షనన్ వద్ద టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణ లారీ కింద ఇరుక్కుని అక్కడిక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ గాదిరెడ్డి దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరుస చోరీలు.. నిందితుడి అరెస్టు
చింతలపూడి: వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చింతలపూడి పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ సీహెచ్ రాజశేఖర్ వివరాలు వెల్లడిస్తూ.. స్థానిక ఫాతిమాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం, పాత రేపూడి గ్రామానికి చెందిన కొప్పుల వెంకటేశ్వరరావు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెంకటేశ్వరరావుపై 35 దోపిడీ, దొంగతనాలు, కేసులు ఉన్నట్లు గుర్తించారన్నారు. నిందితుడు పామర్రు ప్రాంతంలో ఒక వ్యక్తిని మోసం చేసి అతని నుంచి బైక్ దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. చింతలపూడి మండలంలోని ఒక వ్యక్తిని జేసీబీ పని పేరుతో నమ్మించి, దాడి చేసి, అతని వద్ద రూ.7,500 నగదు, ఫోనన్ దొంగిలించినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు.
శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కల పట్టివేత
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో సంచరిస్తున్న వీధి కుక్కలను దేవస్థానం అధికారులు శనివారం పట్టించి, అటవీ ప్రాంతానికి తరలించారు. ద్వారకాతిరుమల గ్రామం, ఆలయ పరిసరాల్లో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉంది. దీంతో క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన ఆలయ అధికారులు తాడేపల్లిగూడెంకు చెందిన సిబ్బందితో వాటిని పట్టించారు. మొత్తం 70 శునకాలను పట్టుకుని, దూర ప్రాంతానికి తరలించారు. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టమని చెప్పినట్టు అధికారులు తెలిపారు.

అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం

అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం

అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం