
ఏటీఎం కార్డు మార్చి డబ్బులు స్వాహా
ఏలూరు టౌన్: ఏటీఎం కార్డు మార్చి వేసి ఏకంగా రూ. లక్షా 51 వేల నగదు స్వాహా చేసిన ఘటన ఇది. వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన కందుల సత్యనారాయణ భీమవరం డీఎంహెచ్వో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 3న ఆయన ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో ఒక ఏటీఎంకు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అక్కడ క్యూలో ఉన్న వ్యక్తికి తన కార్డు ఇచ్చి రూ.1000 డ్రా చేయమన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి రూ.1000 డ్రా చేయడంతోపాటు ఏటీఎం కార్డు మార్చివేసి సత్యనారాయణకు ఇచ్చాడు. ఆ తరువాత ఆ కార్డుతో రూ.లక్షా 51 వేలు డ్రా చేసుకున్నాడు. బాధితుడు సత్యనారాయణ ఈనెల 6న తన జీతం డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లగా విషయం తెలిసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ ఆదేశాలతో బుధవారం కేసు నమోదు చేశారు.
జిల్లాల సరిహద్దులు నిర్ణయించిన సర్వేయర్లు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం వెంకటాద్రి అప్పారావు పురం (వీఏ పురం) గ్రామంలో రీసర్వేలో భాగంగా ఉంగుటూరు మండలానికి, పెంటపాడు మండలం వెస్టు విప్పర్రు గ్రామానికి సరిహద్దులు తేల్చారు. బుధవారం గ్రామంలో జరిపిన సర్వేలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా డిప్యూటి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రమణ, ఉంగుటూరు మండల సర్వేయర్ విశ్వనాథ్, తాడేపల్లిగూడెం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆప్ సర్వే రౌతు రామకృష్ణ, ఉంగుటూరు డిప్యూటీ తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, బొమ్మిడి వీఆర్వో ప్రసాదు, పెంటపాడు మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అలరించిన శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం చూపరులను అలరించింది. తణుకుకు చెందిన అంబికా డాన్స్ అకాడమీ సభ్యులు ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శ్రీనివాసుడు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ నృత్య రూపకాన్ని ఆసక్తిగా తిలకించారు.

ఏటీఎం కార్డు మార్చి డబ్బులు స్వాహా