సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో గ్రేడ్ 4, 5 పంచాయతీ కార్యదర్శులకు ఆరు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు ఈ శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా నేర్చుకున్న అంశాలపై, అవగాహన పెంచుకున్న విధానంపై పరీక్ష నిర్వహించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలోని అకౌంటింగ్, ఆర్థిక వనరులు, వేలం నిర్వహించే విధానం, పంచాయతీ వ్యయాలకు సంబంధించిన నియమాలు, ఆదాయ, వ్యయాల వర్గీకరణ, నిర్వహించాల్సిన రిజిస్టర్లు, పనులు నిర్వహించే విధానం, టెండర్ల అమలు విధానంపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్యాకల్టీలు కె.సుశీల, కేఆర్ నిహరిక, శేషుబాబు, డి.చిన్నబ్బులు, రాజ్కుమార్, కె.రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పంచాయతీ కార్యదర్శులకు సర్టిఫికెట్లు
అందజేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ రమణ
తాటిచెట్టు పైనుంచి పడి
గిరిజనుడి మృతి
చింతూరు: తాటికల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కిన గిరిజనుడు పట్టు తప్పి కిందపడి మృతి చెందాడు. చింతూరు మండలం మదుగూరులో ఈ ఘటన జరిగింది. మదుగూరుకు చెందిన మోటు జోగయ్య (61) తాటి చెట్టు ఎక్కి కల్లు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని గమనించే లోపు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు శనివారం ఫిర్యాదు చేశారని ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


