రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా మటుకు పేద కుటుంబాల వారే ఉంటారు. పదో తరగతి ఉత్తీర్ణత తరువాత ఏంచేయాలన్న విషయమై సరైన మార్గ నిర్దేశనం లేక కొందరు ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయ, ఇతర పనులకు వెళ్తుంటే.. మరికొందరు ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సులపై దృష్టి సారించలేక, శిక్షణ తీసుకునే స్తోమత లేక చదువుకు స్వస్తి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించలేని తల్లిదండ్రుల కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉచిత పాలిసెట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,461 మంది పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ప్రారంభమైన తరగతులు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. పరీక్ష ఎలా ఉంటుంది, ఎలా సన్నద్ధం కావాలి తదితర సందేహాలు నివృత్తి చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది ఇచ్చిన శిక్షణను ఉపయోగించుకున్న విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ చెబుతున్నారు.
ఉచితంగా స్టడీ మెటీరియల్
శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగానే అందజేస్తున్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా మండలిలో నిపుణులైన అధ్యాపకులతో తయారు చేయించిన మెటీరియల్ పాలిసెట్కు ఉపయోగపడనుంది. ఆబ్జెక్టివ్ తరహాలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలోని అంశాలతో కూడిన స్టడీ మెటీరియల్ ఆయా కళాశాలలకు ఇప్పటికే చేరుకుంది. ఈ నెల 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా, 23వ తేదీ వరకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షా కేంద్రాల వారీగా వచ్చిన
దరఖాస్తులు ఇలా..
పరీక్షా కేంద్రం దరఖాస్తులు
కాకినాడ 4,903
సామర్లకోట 633
పెద్దాపురం 1,229
తుని 1,205
రాజమహేంద్రవరం 4,194
ముక్తేశ్వరం 289
మండపేట 751
రామచంద్రపురం 930
అమలాపురం 2,327
ఎటపాక 179
చింతూరు 159
రంపచోడవరం 308
ప్రభుత్వ కళాశాలల్లో
పాలిసెట్కు ఉచిత శిక్షణ
పేదరికం అడ్డు కాకూడదనే
లక్ష్యంతో నిర్వహణ
సబ్జెక్టుల వారీగా మెటీరియల్ అందజేత
ఉమ్మడి జిల్లాలో 14,461 మంది దరఖాస్తు
నేడు తుది గడువు


