ఒకొక్కరికి ఒక్కో సరదా. కొందరికి స్టాంప్స్ సేకరణ.. కొందరికి నాణేలు, కరెన్సీ, మరికొందరికి సిగరెట్టు పెట్టెలు, అగ్గిపెట్టెలు, రంగురంగుల గోళీలు, డ్రింకు సీసాల మూతలు వగైరా వగైరా. ఎవరిదగ్గర ఎక్కువ ఉన్నాయో చూసుకుని పది మందికి చెప్పుకొని.. చూపించుకుని మురిసిపోవడం ఇవన్నీ చిన్ననాటి ముచ్చట్లు. ఆ సేకరణలే పెద్దయ్యాక విలువైన ప్రవృత్తిగా మారుతుంటుంది. ఇలా స్థానిక నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ 1678వ సంవత్సరానికి చెందిన నెదర్లాండ్స్ ‘6 స్టూవియర్స్’ నాణెం మొదలుకుని భారత దేశం ఇటీవల విడుదల చేసిన రూ.వెయ్యి నాణెం వరకు తన ఖజానాలో నిక్షిప్తం చేశారు. ఆస్ట్రేలియా, పోలెండ్ తదితర దేశాలు విడుదల చేసిన త్రికోణ, చతురస్ర, వృత్తాకార, చిల్లు కాణీ ఆకృతుల్లోని నాణేలు ఆయన సేకరించారు. వీటిలో వెండి, రాగి, ద్విలోహ, నికెల్తో తయారు చేసిన నాణేలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హర్మూజ్ జల సంధి ఇటీవల వార్తలలోకి ఎక్కడంతో వివిధ ఓడల ముఖ చిత్రాలతో జల రవాణాపై ఆయా దేశాలు విడుదల చేసిన నాణేలను ఆయన ఆవిష్కరించనున్నారు.
– అమలాపురం టౌన్
చరిత్ర గమనానికి ప్రతిరూపాలు నాణేలు
పాతికేళ్లుగా సేకరిస్తున్న కృష్ణ కామేశ్వర్
1678లో విడుదలైన నాణెం మొదలు 2025లో భారత్ విడుదల చేసిన రూ.వెయ్యి నాణెం వరకు సేకరణ
80 దేశాలకు చెందిన
240 జల రవాణా నాణేలు నిక్షిప్తం


