రాజానగరం: మూడు వారాలుగా పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి వాసులను హడలెత్తిస్తున్న పెద్ద పులి ప్రస్తుతం పాపికొండల వైపు అడుగులు వేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించారు. సోమవారం పోలవరం జిల్లా కొయ్యలవీరవరం, లింగంపల్లి కొండలు, పాపికొండలు నేషనల్ పార్కు సమీపంలో ఉందని తెలుసుకుని ఆ ప్రాంతంలోని గిరిజనులను అప్రమత్తం చేశారు. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. పులి ఆదివారం రాత్రి పూడిపల్లిలో రెండు లేగ దూడలను హతమార్చిందని అధికారులు గుర్తించారు. నదీ తీరం వెంబడి పయనిస్తూ పాపికొండల వైపు వెళ్తుందన్నారు. గడచిన మూడు వారాల నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకూ దాని ప్రయాణం 550 కిలోమీటర్లు దాటిందన్నారు.


