పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభస్వామికి శుక్రవారం శ్రీపుష్పయాగం నేత్రపర్వంగా సాగింది. గత నెల 29న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీపుష్ప యాగం నిర్వహించారు. ఆలయ చైర్మన్ మొయిళ్ల సంధ్య కృష్ణమూర్తి దంపతులు, ఈఓ వడ్డి శ్రీనివాసరావు, ట్రస్టు బోర్డు సభ్యులు స్వామివారికి పండ్లు, వివిధ రకాల మిఠాయిలు, పుష్పాలను సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్లను ఉంచి ఆలయ పండితులు పెద్దింట నారాయణాచార్యులు, పెద్దింటి గోపాలాచార్యులు పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఉయ్యాల మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులు ఉంచారు. తర్వాత చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది.


