రౌతులపూడి: మండలంలోని కత్తిపూడి–కొట్టాం ఆర్ అండ్ బీ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న జంతు కొవ్వును శుక్రవారం రౌతులపూడి శివారున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి పాసింజర్ ఆటోలో కోటనందూరు మండలం కేఏ మల్లవరానికి తరలిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. పట్టుబడ్డ ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆటోల 27 డబ్బాలలో పదిహేను కిలోల చొప్పున 405 కిలోలు, 200 కిలోల డ్రమ్ములో 200 కిలోలు మొత్తం 605 కిలోలు జంతు కొవ్వును గుర్తించామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
జీడిమామిడి తోట దగ్ధం
రూ.లక్షల్లో ఆస్తి నష్టం
రాజవొమ్మంగి: మండలంలోని నెల్లిమెట్ల గ్రామ శివారున జీడి మామిడి తోటలో శుక్రవారం మంటలు ఎగసి తోట మొత్తం కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. పూత పిందె దశలో వున్న తోట కాలిపోవడంతో తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లిందని గ్రామస్తులు అన్నారు. ఆస్తి నష్టం రూ.లక్షల్లో ఉంటుందన్నారు. కాగా తన భార్యకు అనారోగ్యం వల్ల రెండేళ్లుగా చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నానని, తనకున్న ఏకై క ఆధారం కాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తోట యజమాని ఈక చిననాగరాజు వాపోయాడు. కాగా అగ్ని ప్రమాదానికి కారణం తెలియలేదు.
15 ప్రైవేటు బస్సులపై కేసులు
రూ.74,800 అపరాధ రుసుము వసూలు
రావులపాలెం: నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసి ఫిట్నెస్ రద్దు చేస్తామని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు అన్నారు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.74,800 అపరాధ రుసుము విధించినట్టు డీటీఓ తెలిపారు.


