చోరీ జరిగిన ఇంటిలో
వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం
● ఇంట్లోకి చొరబడి 150 గ్రాముల
బంగారు ఆభరణాల అపహరణ
● యజమానిని తాళ్లతో మంచానికి
బంధించి దురాగతం
కోరుకొండ: మండలం కాపవరం శివారు నార్త్జోన్ డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ముండ్రు పద్మ ఇంటిలోని 150 గ్రాముల బంగారు ఆభరణాలు గురువారం రాత్రి చోరీకి గురయ్యాయి. సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు పద్మ గురువారం స్థానిక బ్యాంకులోని తన నగదు ఖాతా నుంచి డబ్బులు తీసుకుని రాజమహేంద్రవరంలో బంగారం కొనుగోలు చేసి ఇంటిలోని బీరువాలో భద్రపరిచారు. రాత్రి వేళ విదేశాల్లో ఉన్న తన పిల్లలతో ఫోన్లో మాట్లాడి నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ముగ్గురు ఇంటిలోకి రాగా, మరో వ్యక్తి బయట ఉండడాన్ని ఆమె గుర్తించింది. ఇంతలో లోపలికి వచ్చినవారు ఆమెను మంచానికి కట్టేసి నగదు, సొత్తు కోసం బెదిరించడంతో ఆమె బీరువా వైపు చూపింది. దీంతో వారు బీరువాలోని 150 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అంతటితో ఆగక ఇంట్లో కోడిగుడ్లతో వంట చేసుకుని తిని బంగారు ఆబరణాలతో ఉడాయించారు. క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్తో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మూర్తి తెలిపారు.


