కేసీఎం చొరవతో వచ్చిన బాధితులు
అమలాపురం రూరల్: మస్కట్ వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరి మహిళలను కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో కేసీఎం అధికారులు కోనసీమకు సురక్షితంగా తీసుకు వచ్చారు. గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన బీరా శేషారత్నం గత ఏడాది ఆగస్టులో, పోతవరం గ్రామానికి చెందిన గుమ్మల్ల శ్రీలక్ష్మి అదే ఏడాది సెప్టెంబర్లో మస్కట్ వెళ్లారు. శేషారత్నం పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో మధుమేహానికి గురై అనారోగ్యం పాలైంది. దీంతో కాలికి గాయమై పరిస్థితి విషమించింది. పని చేయలేని స్థితిలో ఆమెను యజమానులు సంబంధిత కార్యాలయానికి అప్పగించారు. ఆమెను పంపిన ఏజెంట్ను సంప్రదించగా, భారతదేశానికి పంపేందుకు నిరాకరించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను సంప్రదించగా అధికారులు ఏజెంట్తో మాట్లాడి ఆమెను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు.
అలాగే లక్ష్మి మొదట ఒక ఇంటిలో పనికి చేరినప్పటికీ, పని నచ్చకపోవడంతో తిరిగి ఏజెంట్కు అప్పగించారు. అనంతరం మరో ఇంటిలో కుదిరి బుద్ధి మాంధ్యం ఉన్న బాలుడి బాగోగులు చూడాల్సి వచ్చింది. అక్కడ ఆమెకు పలు ఇబ్బందులు రావడంతో ఆమెను ఏజెంట్కు అప్పగించారు. అతడు రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విషయం తెలుసుకున్న కేసీఎం సభ్యులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబీ సఫియా పాల్గొన్నారు.


