● నన్ను అన్యాయంగా వేధిస్తున్నారు
● మాజీ మంత్రి అంబటి రాంబాబు
కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వం తనను అన్యాయంగా వేధిస్తోందని, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఇదే తరహాలో ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీల్లో ఉన్న కాపులంతా తాను చేస్తున్న ధర్మ పోరాటానికి మద్దతు పలకాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజల చేతిలో చంద్రబాబు, ఇతర కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించుకొనే సమయం దగ్గరలో ఉందన్నారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు మోసగించారన్నారు. ఆ అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీగా చెప్పిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన నాయకులు ఆ అంశాన్ని కేంద్రంతో ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాకాలం నుంచి తాను రాజకీయాల్లో ఉంటున్నానని, విలువలతో కూడిన రాజకీయాల కోసం ప్రస్తుతం తాను వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడుస్తున్నానన్నారు.
తనను బెదిరించేందుకు కుట్ర పూరితంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనను పలకరించిన వారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా మండపేటలో ఎమ్మెల్సీ తోటను కలిసానన్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లోని కొందరు కాపు నేతలు తనను పలకరించారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకుడిగానే కాకుండా సామాజికవర్గ పరంగా అంబటికి సంఘీభావం తెలిపానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అణచివేత పాలనకు అంబటి అరెస్ట్ ఒక ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు తోట రామకష్ణ, కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజకుమారి, సీనియర్ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, తోట పృథ్వీరాజ్, పిల్లా వీరబాబు, కుడిపూడి రాంబాబు, సిరిపురపు శ్రీనివాస్, పలివెల సుధాకర్, మండపేట పట్టణ, రూరల్, కపిలేశ్వరపురం మండల కమిటీల అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, గూటం సత్యనారాయణ, అడబాల బాబ్జి, ఎంపీపీలు జుత్తుక వెంకటలక్ష్మి, నౌడు వెంకటరమణ, భీమవరం నాయకులు చినిమిల్లి వెంకటరాయుడు, స్థానిక నేతలు కురుపూడి రాంబాబు, నక్కా సింహాచలం, ఓగిరాల దేవి, మేడిశెట్టి సత్యవేణి పాల్గొన్నారు.


