
ఆది నాయకా.. వినాయకా
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆదినాయకుడైన ఆ వినాయక స్వామివారిని చూసి భక్తుల మది మురిసింది. తెల్లవారుజామునే స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 52 మంది, ఉండ్రాళ్ల పూజలో ఇరువురు పాల్గొన్నారు. ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. లక్ష్మీగణపతి హోమంలో 13 జంటలు, వాహన పూజలను 49 మంది చేయించుకున్నారు. 1,820 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,27,275 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.