
పింఛను సొమ్ముతో వెటర్నరీ అసిస్టెంట్ పరారీ
రంగంపేట: లబ్ధిదారులకు అందించాల్సిన పింఛను సొ మ్ముతో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పరారయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రేడు గ్రామ సచివాలయానికి సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.14.03 లక్షలు విడుదలయ్యా యి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రంగంపేట ఆర్సీబీ బ్రాంచ్ నుంచి సంక్షేమ, విద్యా సహాయకుడు పూర్ణచంద్రరావు గత నెల 30న ఆ మొత్తాన్ని డ్రా చేసి, పెన్షన్ల పంపిణీకి బాధ్యులైన అధికారులకు అందజేయాల్సి ఉంది. అందులో రూ.2,13,500ను వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్కి అప్పగించి, అతడి వద్ద రసీదు తీసుకున్నారు. కానీ గణేష్ సోమవారం పింఛన్లు పంపిణీ చేయకుండా, విధులకూ హాజరు కాకుండా, ఫోన్ స్విచాఫ్ చేశాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో పింఛనుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఎంపీడీవో వీరసాయిబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి బోనగిరి వెంకన్నబాబు రంగంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. ఎస్సై శివప్రసాద్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, గణేష్ ఇంతకు ముందు పనిచేసిన పెద పూడి మండలంలోనూ అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో గణేష్ పెదపూడి నుంచి రంగంపేట మండలం చండ్రేడు సచివాలయానికి వచ్చాడు. చండ్రేడులో పింఛన్ల పంపిణీకి అంతరాయం లేకుండా ఉండేందుకు కొత్త పీడీఓని నియమించినట్టు ఎంపీడీవో సాయిబాబు చెప్పారు. ఈ వ్యవహారాన్ని అధికారులు కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ను సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
● పోలీసు కేసు నమోదు
● కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్