సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్టీఆర్ జయంతిని మొదటిసారి రాష్ట్ర పండగగా జరుపుకుంటున్నామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సమాచార పౌర సంబంధాల అధికారి, కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం కథానాయకుడు మాత్రమే కాదని, ఒక పరిపూర్ణమైన నటుడని అన్నారు.
రావణాసురుడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయక పాత్ర లను కూడా ప్రేక్షకులు మెచ్చేలా నటించడం ఎన్టీఆర్కే సాధ్యమైందని చెప్పారు. సీ్త్రలకు ఆస్తి హక్కు దక్కేలా చట్ట సవరణ చేశారని, జనతా వస్త్రాలు రేషన్ షాపుల ద్వారా అందించారని, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియామకం పొందిన కె.ఎస్.జవహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డీపీటీఓగా మూర్తి బాధ్యతల స్వీకరణ
రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వైఎస్ఎన్ మూర్తి బుధవారం రాజమహేంద్రవరంలో బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం డిపో మేనేజర్గా విధులు నిర్వహిస్తూ డీపీటీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఉమ్మడి జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి కొండలరావు అభినందనలు తెలిపారు.
లోవకు హుండీల ఆదాయం రూ.42.28 లక్షలు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.42,28,835 ఆదాయం లభించినట్టు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బుధవారం కాకినాడ భీమేశ్వరస్వామి గ్రేడ్–2 ఈఓ ఆర్.రాజేశ్వరరావు, సిరిపురం గ్రూపు టెంపుల్స్ గ్రేడ్–3 కార్యనిర్వహణ అధికారి ఎం.సూర్య రమణి సమక్షంలో హుండీలను తెరిచి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో నగదు లెక్కించినట్టు ఈఓ తెలిపారు. నాణేలు రూ.2,66,236, నోట్లు రూ.39,62,600 వచ్చాయన్నారు. లెక్కింపులో గోదావరి చైతన్య బ్యాంకు సిబ్బంది, దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగి సస్పెన్షన్
హుండీల ద్వారా భక్తులు సమర్పించిన నగదును లెక్కింపులో తస్కరించిన దేవస్థానం అటెండర్ ఎల్.ఎస్.వి.రమణను సస్పెండ్ చేసినట్టు ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో 109 నోట్లు ఉన్న రూ.500 కట్టను తస్కరించినట్టు సిబ్బంది గుర్తించారని, ఈ విషయం సీసీ ఫుటేజ్లోను స్పష్టమయినట్టు ఈఓ తెలిపారు. చోరీకి పాల్పడిన రమణపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం విధుల నుంచి తొలగించామన్నారు.
అటెండర్ ఆత్మహత్యాయత్నం
నేరారోపణకు గురైన అటెండర్ ఎల్ఎస్వీ రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను సస్పెండ్ చేయడంతో మనస్థాపం చెందిన రమణ దేవస్థానం మూడో అంతస్తు నుంచి కిందకు (వినాయకుడి గుడి) వద్దకు దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రమణను సహ ఉద్యోగులు తుని ఏరియా ఆస్పత్రికి అక్కడ నుంచి కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయమవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
గోదావరిలో క్రాంతి కిరణ్ మృతదేహం లభ్యం
ముమ్మిడివరం: కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలోని గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల్లో సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహం బుధవారం ఉదయం సంఘటన స్థలంలో లభ్యమైంది. కె.గంగవరం మండలం శేరిల్లంకలో స్నేహితుడి ఇంట సోమవారం జరిగిన ఓణీ ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన ఎనిమిదిమంది యువకులు గోదావరిలో గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఐ.పోలవరం మండలం జి.మూలపొలం శివారు ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్, కాకినాడ తూరంగికి చెందిన యలవర్తి సాయి మహేష్, కాకినాడ గోళీలపేటకు చెందిన సబ్బతి పాల్ అభిషేక్, కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన ఎలిపే మహేష్, మండపేటకు చెందిన కులపాక రోహిత్, కరప మండలం గురజనాపల్లికి చెందిన తాతపూడి నితీష్ల మృతదేహాలు మంగళవారం దొరికాయి.
సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొన్నారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయన బుధవారం ఉదయం సంఘటనా స్థలంలో క్రాంతి కిరణ్ మృతదేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జి.మూలపొలం శివారు ఎర్రగరువు చెందిన అన్నదమ్ములు వడ్డి మహేష్, వడ్డి రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.