
పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తర భారత దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హలో సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు మీదుగా వారణాసి, ప్రయోగరాజ్, రామ జన్మభూమి, త్రివేణి సంగమం నైమిశా శరణ్యం సందర్శించుకోవచ్చన్నారు. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పర్యటన ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీల్లో ఉందన్నారు. ఈ రైలుకు విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూలై 5న పంచ జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమై అదే నెల 13న యాత్ర ముగుస్తుందన్నారు. నాగపూర్, ఉజ్జయిని, నాసిక్, పూణే ఔరంగాబాద్, డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలం మహా పుణ్యస్థలాల సందర్శన ఉంటుందన్నారు. ఈ రైలుకు కామారెడ్డి, నిజామాబాద్, నాందేడు, పూర్ణ స్టేషన్లో బోర్డింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి లేహ్, లడఖ్, చారుదాం, గోవాలకు విమాన ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో ఐసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు.