
బాణసంచా పేలుడు కేసులో 10 ఏళ్ల జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనధికారికంగా బాణసంచా నిల్వ ఉంచి ముగ్గురి మృతికి కారణమైన ఘటనలో దేవాడ ముత్యాలరెడ్డికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.31,500 జరిమానా విధిస్తూ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్ కోర్టు జడ్జి ప్రకాశ్బాబు మంగళవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 సంవత్సరాల 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. లాలాచెరువు, సుబ్బారావుపేటలో దీపావళి సామానులు తయారు చేసేందుకు మందుగుండు సామగ్రి అనధికారికంగా నిల్వ ఉంచారు. 2018 సెప్టెంబర్ 22న నిల్వ ఉంచిన మందుగుండు పేలి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్పటి సీఐ సూర్యభాస్కర్ కేసు నమోదు చేశారు. దీనిపై వాదనలు పూర్తయి, నిజనిర్ధారణ కావడంతో ముత్యాలరెడ్డికి శిక్ష విఽధిస్తూ తీర్పు నిచ్చారు.
ప్రమాదపుటంచున ప్రయాణం
కాజులూరు: కాలువలకు నీరుకట్టివెయ్యటంతో డెల్టా ప్రాంతంలో మట్టిపనులు జరుగుతున్నాయి. మండల గ్రామాలలోని పొలాల్లో మెరక పనులు నిర్వహించేందుకు దూర ప్రాంతాల నుంచి పొక్లెయిన్, జేసీబీలను ఇలా లారీలపై తరలిస్తున్నారు. ఈ సమయంలో పొక్లెయిన్ డ్రైవర్లు, క్లీనర్లు అదనపు ప్రయాణ ఖర్చులెందుకని ఇలా ప్రమాదపుటంచున ప్రయాణాలు సాగిస్తున్నారు.