
గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులదే..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గృహ నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేస్తున్నా, స్టేజి కన్వర్షన్ విధానంలో నిర్లిప్తత చూపితే ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్, మండల స్థాయి, ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మూడు నెలలుగా ఒక్క ఇంటికి స్టేజి కన్వర్షన్ లేకపోగా 10 రోజుల్లో పూర్తి చేస్తామని ఎలా చెప్ప గలుగుతున్నారని ప్రశ్నించారు. అటువంటి అధికారులు, సిబ్బంది వ్యక్తిగత పనితీరుపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇన్చార్జి జిల్లా హౌసింగ్ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 3,362 మందికి అదనపు ఆర్థిక సహాయం విడుదల చేశామన్నారు. అయితే లింటల్ లెవెల్ 701, రూఫ్ లెవెల్ 464 , రూఫ్ కంప్లీట్ స్థాయిలో 49 ఉన్నాయన్నారు. వాటిపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పర్యవేక్షణ పెంచాలి
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత ప్రాంతాల్లో, నిషేధిత కాలంలో ఇసుక తవ్వకాలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి డీఎల్ఎస్ఏ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 1వ తేదీ నుంచి సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్ల వద్ద ఇసుక తవ్వకాలు జరపరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిషేధ సమయంలో ఇసుక తవ్వకాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
కలెక్టర్ ప్రశాంతి