
ఉపాధి పోయి.. ఊపిరి విడిచి..
కడియం: ఎప్పటిలాగే విధి నిర్వహణకు వెళ్లిన ఆయనకు ఓ చేదువార్త ఎదురైంది. పంచాయతీ వారు పని నుంచి తీసేశారని శానిటరీ మేసీ్త్రకి చెప్పారు. జీవనోపాధి కోల్పోయానన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అదే ధ్యాసలో ఉంటూ రెండ్రోజుల వ్యవధిలోనే గుండెపోటుకు గురై ఈ లోకం నుంచే నిష్క్రమించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వేమగిరి పంచాయతీలో 21 ఏళ్లుగా పేర్ల సింహాచలం(58) శానిటరీ మేసీ్త్రగా పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి రూప్చంద్ శానిటరీ మేసీ్త్రలను తొలగించారు. అందులో సింహాచలం కూడా ఉన్నారు. ధవళేశ్వరం నుంచి ఎప్పటిలాగే సోమవారం ఆయన పంచాయతీ వద్దకు రాగా, ఆయనను తొలగించినట్టు చెప్పారు. దీంతో గ్రామంలోని పెద్దలను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో దిగులుగా ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచీ దిగాలుగా ఉన్న సింహాచలం మంగళవారం గుండెపోటుకు గురై, కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సింహాచలం భార్య ఇటీవల కన్నుమూసింది. ఆయనకు వివాహమైన కుమార్తె ఉంది. కాగా సైకిల్పై తిరుగూ పారిశుధ్య పనులు పర్యవేక్షించే సింహాచలం గ్రామంలో అందరి మన్ననను పొందేవారు. ఆయన మరణవార్త తెలియగానే బుధవారం కార్మికులకు సెలవు ప్రకటించారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
చోరీ కేసులో ఇద్దరికి జైలు
కంబాలచెరువు: దొంగతనం కేసులో ఇద్దరికి ఆరు నెలల కారాగార శిక్ష విధిస్తూ ఐదో ఏజీఎఫ్సీఎం న్యాయమూర్తి జి.శ్రీనివాసరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. స్థానిక పీఅండ్టీ కాలనీ వేంకటేశ్వరస్వామి గుడి వీధికి చెందిన నల్లమిల్లి వరలక్ష్మి 2021 ఫిబ్రవరి 20న ఇంటి పెరట్లో ఉండగా, క్వారీ మార్కెట్కు చెందిన వడ్డి శ్రీధర్దాస్, బర్రె శేఖర్ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆమె మెడలోని బంగారు చంద్రహారం, మంగళసూత్రాల తాడును లాక్కుని పారిపోయారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి అల్లుడు కర్రి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై రామ్మోహన్ కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఏపీపీ బీవీ రామ్మోహనరావు కోర్టులో వాదనలు వినిపించారు. నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.
చెరువులో పడి మేకల కాపరి మృతి
నల్లజర్ల: ఫిట్స్ రావడంతో చెరువులో పడిన మేకల కాపరి మృతిచెందిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే, పోతవరానికి చెందిన జువాల కుటుంబరావు(55) మేకల కాపరిగా జీవిస్తున్నాడు. బుధవారం మేకలు తోలుకుని యర్నగూడెం వైపు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఫిట్స్ రావడంతో గట్టు పైనుంచి పాత్రుని చెరువులో పడిపోయాడు. ఎవరూ గమనించక పోవడంతో మృతి చెందాడు. సాయంత్రం అటుగా వెళుతున్న కొందరు చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై తమకు సమాచారం అందలేదని ఎస్సై పీవీ సత్యనారాయణ తెలిపారు.
షార్ట్సర్క్యూట్తో రెండు తాటాకిళ్లు దగ్ధం
నాలుగు కుటుంబాలు నిరాశ్రయం
అంబాజీపేట: మండలంలోని వాకలగరువు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాకలగరువు పంచాయతీ పరిధిలోని బుల్లి కాలనీలో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి, రెండు తాటాకిళ్లు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో నాలు గు కుటుంబాల వారు జీవిస్తున్నారు. వారి గృహోపకరణ వస్తువులతో పాటు, దుస్తులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు బూడిదయ్యాయి. ఈ ఘటనలో దాకే శ్రీనివాసరావు, దాకే వెంకటరావు, ముత్తాబత్తుల వీరవెంకట సత్యనారాయణ, ముత్తాబత్తుల దుర్గారావు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. నిత్యావసర సరకులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. సర్పంచ్ మద్దింశెట్టి దొరబాబు, ఎంపీటీసీ సభ్యుడు వాకపల్లి దొరబాబు పాల్గొన్నారు.
పురుగు మందు తాగిన కుటుంబం
మలికిపురం: ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన మహిళ తమను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరిన ఉదంతమిది. మండలంలోని కేశనపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరావు భార్య లక్ష్మి ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లింది. ఏళ్లు గడస్తున్నా తమను పట్టించుకోవడం లేదని నాగేశ్వరరావు, వారి కుమారుడు సుమన్, కుమార్తె ప్రశాంతి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆమె స్వగ్రామానికి రాలేదు. మాట్లాడాలని ఫోన్ చేసినా స్పందించడం లేదు.
కనీసం కుటుంబ పోషణకు డబ్బు కూడా పంపిచడం లేదు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావుతో పాటు, వారి పిల్లలిద్దరూ బుధవారం ఉదయం పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు గుర్తించి, రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మలికిపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
● గుండెపోటుతో శానిటరీ మేసీ్త్ర మృతి
● పని నుంచి తొలగించడమే కారణం!

ఉపాధి పోయి.. ఊపిరి విడిచి..