
ఆలయాల్లో చోరీలు చేసే ఆటోడ్రైవరు అరెస్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అందరూ దేవుడి గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు హుండీల్లో డబ్బులు వేస్తే ఇతగాడు హుండీలు దొంగిలించేందురు ఆలయాలకు వెళుతుంటాడు. జిల్లాలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ఆలయాల్లో హుండీలు కొల్లగొడుతున్న దొంగను రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్టేషన్ ఆవరణలో గురువారం విలేకరులకు సెంట్రల్ డీఎస్పీ కె.రమేష్ బాబు, మూడో పట్టణ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు ఆ వివరాలు తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని అసూరు గ్రామానికి చెందిన పారేపల్లి బాబి రాజమహేంద్రవరం గోకవరం బస్టాండులో టీ దుకాణంలో పనిచేసేవాడు. ఆ తర్వాత ఆటో డ్రైవరుగా మారాడు. కొన్నాళ్లకు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఆలయాల్లో హుండీలు చోరీ చేయాలన్న తలంపు వచ్చింది. అందుకు పథక రచన చేసుకుని ఆలయాల గేట్లు కోసేందుకు కట్టర్ కొన్నాడు. దొంగతనం చేసేందుకు నిర్దేశించుకుస్న ఆలయానికి పగటి సమయంలో భక్తుడిలా వెళ్లి ఆనుపానులు పరిశీలించేవాడు. రాత్రి సమయంలో ఆ ఆలయం సమీపంలో ఆటోను ఆపి ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటాడు. జన సంచారం తగ్గిన తరువాత ముందే సిద్ధం చేసుకున్న ఎలక్ట్రికల్ కట్టర్తో ఆ గుడి కరెంటు ఉపయోగించుకుని గేటు కట్ చేస్తాడు. లోపల హుండీ తాళాన్ని కూడా కోసి డబ్బు మొత్తం దోచుకుని వెళతాడు. దొంగతనానికి వెళ్లినా ఇతడికి ఉన్న దైవ భక్తి కారణంగా ఆలయంలో విగ్రహాలపై ఉండే వస్తువులను ముట్టుకునేవాడు కాదు. ఇలా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో నాలుగు ఆలయాల్లో, కోరుకొండ పరిధిలో ఒక ఆలయంలో హుండీలు దోచుకున్నాడు. ఆలయాల్లో వరుస దొంగతనాలతో ఎస్పీ నరసింహకిశోర్ ఆదేశాల మేరకు క్రైం అదనపు ఎస్పీ అర్జున్ పర్యవేక్షణలో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. లింగంపేట వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేశారు. హుండీల డబ్బుతో గోవా వెళ్లి జల్సా చేయాలని కొంత డబ్బు దాచినట్టు విచారణలో నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడి నుంచి రూ.95 వేలు నగదు, నేర పరికరాలు, ఆటో, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, పి.మహేష్కుమార్, కె.పవన్కుమార్, కె.శ్రీనివాసులను ఎస్పీ అభినందించారు.