
లోక కల్యాణార్థం వేద సదస్యం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ముఖ్య అర్చకుడు గొడవర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాలభోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం), వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది వేద పండితుల ఆధ్వర్యంలో చతుర్వేద మహదాశీర్వచనంలో భాగంగా లోక కల్యాణార్థం వేద సదస్యం నిర్వహించారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పనపల్లికి చెందిన శ్రీశేష శారద భక్త బృందం ఆలపించిన పురంధర దాసు కీర్తనలు అబ్బురపర్చాయి. మానేపల్లికి చెందిన అరుణకుమారి, జీవీ రమణ బృందం ఆధ్యాత్మిక గీతాలు ఆలపించింది. అప్పనపల్లికి చెందిన కాజులూరి మహేంద్రకుమార్ బృందం ఆధ్యర్యంలో శ్రీసీతారామ బాలభక్త బృందం కళాకారులు తమదైన శైలిలో ఆధ్యాత్మిక గీతాలను పాడారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.