
పెళ్లింట వినోదం.. అంతలోనే విషాదం
గండేపల్లి: ఆ పెళ్లింట ఆనందంగా గడుపుతున్న వేళ అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బంధువులతో కళకళలాడుతున్న చోట అంతులేని దుఃఖం మిగిలింది. అందరితో సరదాగా గడిపిన వ్యక్తి మృత్యుఒడికి చేరుకున్న సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు ములంపాక సురేష్ సోదరుడు కృష్ణ (48) హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాతకు గురయ్యాడు. గురువారం రాత్రి సమీప బంధువు వివాహ వేడుకలో కృష్ణ ఎంతో సరదాగా గడిపి, శుక్రవారం రాత్రి బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య దేవి, కొడుకు కార్తీక్, కూతురు హాసిని ఉన్నారు. మారేడుమిల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా కృష్ణ పని చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండే అతను మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నామని స్నేహితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని కొడుకు 9వ తరగతి పూర్తి చేయగా, కుమార్తె ఇంటర్ ఫలితాల్లో 987 మార్కులు సాధించారు. ఈ ఆనందాన్ని పంచుకునేలోపే దూరమైపోయావా అంటూ కుటుంబ సభ్యుల రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
పాముకాటుకు ఉపాధి కూలీ మృతి
కాజులూరు: పెదలంకలో పాముకాటుకు ఉపాధి కూలీ పాలిక నాగేశ్వరరావు (62) మృతి చెందాడు. స్థానికులు, ఉపాధి ఏపీఓ వెంకటలక్ష్మి కథనం ప్రకారం.. శనివారం స్థానికంగా ఉండే పంట కాలువ వద్ద ఉపాధి పనులు చేస్తుండగా పాలిక నాగేశ్వరరావును తాచుపాము కరవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికులు సమీపంలోని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఏపీఓ వెంకటలకి్ష్మ్, సర్పంచ్ చెరువూరి వెంకట సత్యనారాయణ రాజు పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
07జెపిటి122:
పెళ్లికి ముందు కల్యాణ వేదిక వద్ద
భార్యతో కలసి డ్యాన్స్ చేస్తున్న కృష్ణ