
మట్టి మాయం
ఏలేశ్వరం: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి తయారైంది. రైతులకు మేలు చేస్తున్న చెరువును సైతం వదలడం లేదు. వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న చెరువులో మట్టిపై కన్నుపడింది. ఏలేశ్వరం శివారులో సుమారు 1,800 విస్తీర్ణంలో ఉన్న తిమ్మరాజు చెరువు ద్వారా సుమారు ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో మట్టిని నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో అనుచరులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడైన ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తి మట్టి తవ్వకాల ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. రెండు జేసీబీలతో వందలాది లారీలతో చెరువు గర్భంలోని మట్టిని తరలించేస్తున్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సైతం తమ స్థాయికి మించిన మామూళ్లు అందుతుండడంతో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఫ తెలుగు తమ్ముళ్ల అక్రమ దందా
ఫ సాగునీటి చెరువులో తవ్వకాలు
ఫ చోద్యం చూస్తున్న అధికారులు