
సత్యదేవుని సన్నిధికి సులువుగా!
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సత్యదేవుని దర్శనానికి మరో మార్గానికి పనులు చురుగ్గా సాగుతున్నా యి. మొదటి ఘాట్రోడ్డు వద్ద గల టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.90 లక్షల వ్యయంతో సుమారు 450 మెట్లతో ఆకర్షణీయంగా ఈ మార్గం రూపుదిద్దుకుంటోంది.
రాజస్థాన్ కార్మికుల మెళకువలతో
రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన మెషీన్తో అందమైన పరిమాణాల్లో కట్ చేసిన రాళ్లను మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. తొలిపావంచా నుంచి స్వామివారి ఆలయానికి ఉన్న ప్రస్తుతం మెట్లను సుమారు 50 ఏళ్ల క్రితం రాతితో నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మిస్త్న్ను రెండో మెట్లమార్గానికి గ్రానైట్, మార్బుల్ రాళ్లను యంత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
2010లోనే ప్రతిపాదన
2010 సంవత్సరంలో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో సందర్శకుల బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడి నుంచి తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి మెట్లపై స్వామివారి దర్శనానికి వెళ్లాల్సివచ్చేది. ఇది దూరాభారం కావడంతో కళాశాల మైదానానికి దగ్గరలో మరో మెట్లదారి నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇంతలో ఆయన 2012లో బదిలీకావడంతో ఆ ప్రతిపాదన మూలపడింది. మళ్లీ 2023లో ఆయన ఈఓగా రావడంతో ఈ మెట్ల మార్గం పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు.
మూడు మలుపులు, 450 మెట్లు
ఈ మార్గాన్ని 450 మెట్లతో మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ నుంచి మెట్లు ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల రోడ్డు వద్ద ముగియనున్నాయి. అక్కడ నుంచి 200 మీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది.
గత ఏప్రిల్లో ప్రారంభించిన పనుల్లో భాగంగా వంద మెట్లు పూర్తి చేశారు. ఇంకా 350 మెట్లు నిర్మించాల్సి ఉంది. ఈ మెట్లకు అవసరమైన రాయిని ప్రత్తిపాడులోని క్వారీ నుంచి తీసుకువచ్చి మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు.
భక్తుల విశ్రాంతికి ఏర్పాట్లు
మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు అలసట చెందితే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్లు, తాగునీటి సదుపాయానికి పక్కనే కొంత స్థలాన్ని చదును చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మూడు నెలల్లో పూర్తి
ఈ మెట్ల నిర్మాణాన్ని ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేయనున్నట్టు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్కుమార్ తెలిపారు.
పనుల పరిశీలన
దేవదాయశాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ ఈ మెట్ల మార్గం పనులను ఇటీవల పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు.
చురుగ్గా రెండో మెట్లదారి నిర్మాణం
రూ.90 లక్షలతో 450 మెట్లు ఏర్పాటు
ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి

సత్యదేవుని సన్నిధికి సులువుగా!

సత్యదేవుని సన్నిధికి సులువుగా!