
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుని: స్థానిక జాతీయ రహదారి కొండవారిపేట ప్రాంతంలో ఉన్న చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన తెలిపిన వివరాల మేరకు పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు (40)గా మృతుడిని గుర్తించారు. ప్రస్తుతం వీరభద్రరావు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. ప్రమాదమా, లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
ఏడీబీ రోడ్డుపై లారీ దగ్ధం
రంగంపేట: స్థానిక శివారు ఏడీబీ రోడ్డుపై బుధవారం కాంక్రీట్ మిల్లర్ లారీ దగ్ధమైంది. ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కాంక్రీట్ తీసుకువచ్చిన లారీ అన్లోడింగ్ అనంతరం డ్రైవర్ లారీని రోడ్డుపై పార్కు చేసి పక్కకు వెళ్లారు. అనంతరం లారీపై ఉన్న విద్యుత్తు తీగలు గాలికి కదిలి తాకడంతో ఒక్కసారిగా లారీ టైర్ల నుంచి మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి