భారం చెత్తగించండి.. | - | Sakshi
Sakshi News home page

భారం చెత్తగించండి..

Jun 8 2025 12:15 AM | Updated on Jun 8 2025 12:15 AM

భారం

భారం చెత్తగించండి..

రత్నగిరిపై పారిశుధ్యానికి పెరిగిన ఖర్చులు

కొత్త టెండర్‌ అంచనాల ప్రకారం నెలకు రూ.80 లక్షలు

అన్నవరం: సత్యదేవునికి వచ్చే ఆదాయం కన్నా అయ్యే ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది. ఏ నిర్మాణాలూ చేపట్టకుండా, సీజీఎఫ్‌, ఆడిట్‌ ఫీజు, అర్చక వెల్ఫేర్‌ ట్రస్ట్‌లకు చెల్లింపులు చేయకుండా అలా నెట్టుకుంటూ వెళ్తే సరి.. లేకపోతే బండి ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానానికి మరింత ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ మరింత భారం కానుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో శానిటరీ మెటీరియల్‌తో సహ క్లీనింగ్‌, హౌస్‌ కీపింగ్‌ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు గత ఏప్రిల్‌లో పిలిచిన సెంట్రలైజ్డ్‌ టెండర్‌ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని అంశాలను కలిపి త్వరలో రీటెండర్‌ పిలవనుంది.

కొలిక్కి రాని టెండర్‌

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్‌ పిలవాలని దాదాపు ఆరు నెలలు ఆలస్యం చేశారు. అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్‌ కీపింగ్‌, రహదారులు, టాయిలెట్ల క్లీనింగ్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ తదితర పనులు నిర్వహించడానికి రెండేళ్ల కాల పరిమితికి గత ఏప్రిల్‌లో పిలిచిన టెండర్‌ను రద్దు చేశారు. సత్రాల్లో ఏసీలు, విద్యుత్‌ ఉపకరణాల నిర్వహణతో పాటు సిబ్బందికి వారాంతపు సెలవులు, మహిళా సిబ్బందికి నెల నెలా వచ్చే శారీకర మార్పులప్పుడు ఇవ్వాల్సిన సెలవులకు గాను అదనపు సిబ్బందిని కూడా కలుపుతూ కొత్తగా టెండర్‌ పిలవనున్నారు.

పెరగనున్న సిబ్బంది, ఖర్చులు

రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో విస్తీర్ణంలో శ్రీశైలం దేవస్థానం తరువాత అన్నవరం విస్తీర్ణం పెద్దది. అందుకే అన్నవరం దేవస్థానంలో ప్రస్తుతం 349 మంది మాత్రమే పని చేస్తుండగా, 375 మంది సిబ్బంది అవసరమని లెక్కేశారు. కొత్త టెండర్‌లో సిబ్బంది పెరిగితే శానిటరీ కాంట్రాక్ట్‌ వ్యయం కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు. కాగా, రెండేళ్లు శానిటరీ కాంట్రాక్ట్‌ నిర్వహించిన కేఎల్‌టీఎస్‌ సంస్థ నెలకు రూ.49 లక్షలకు పారిశుధ్య పనులు నిర్వహించింది. నవంబర్‌తో ఆ సంస్థ టెండర్‌ ముగిసినా ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించింది. ఆ సంస్థ కాంట్రాక్ట్‌ నుంచి వైదొలిగాక దేవస్థానం తాత్కాలికంగా రెండు నెలల నుంచి గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీస్‌కు నెలకు రూ.59 లక్షలు చెల్లిస్తున్నారు. మరో రూ.12 లక్షలు శానిటరీ మెటీరియల్‌కు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం మీద రూ.71 లక్షల ఖర్చు అవుతోంది. పారిశుధ్య పనుల్లో అత్యాధునిక మిషనరీలు ఉపయోగించాలనే షరతుతో పాటు, శానిటరీ సిబ్బందికి లేబర్‌ యాక్ట్‌ ప్రకారం కచ్చితంగా జీతాలు చెల్లించాలనే షరతుతో ఈ సారి రూ. 80 లక్షలకు పైగా టెండర్‌ కోట్‌ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. పది కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది.

బడ్జెట్‌ సవరించాలి

అన్నవరం దేవస్థానానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌ రూ.171.33 కోట్లు కాగా, అందులో పారిశుధ్య నిర్వహణకు రూ.7.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు పారిశుధ్య నిర్వహణ వ్యయం రూ.పది కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు కేటాయింపులు సవరించాల్సి ఉంది.

అభ్యంతరాల నేపథ్యంలో..

గత ఏప్రిల్‌లో పిలిచిన శానిటేషన్‌ టెండర్లలోని ప్రీ బిడ్‌ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థల ప్రతినిధులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలంటూ నిబంధన చేర్చారని, అటువంటప్పుడు సిబ్బందిని పెంచకుండా వీక్లీ ఆఫ్‌ ఎలా ఇవ్వాలంటూ వారి నుంచి ప్రశ్న వచ్చింది. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేసి కొత్త నిబంధనలు, సిబ్బంది పెంపుదలతో కొత్త టెండర్‌ పిలవడానికి ప్రభుత్వం దేవదాయశాఖకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే రీ టెండర్‌ పిలవనున్నారు.

భారం చెత్తగించండి..1
1/1

భారం చెత్తగించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement