
దళితులను విద్యకు దూరం చేయొద్దు
తాళ్లపూడి (కొవ్వూరు): ఎస్సీ ఏరియాలో ఉన్న ప్రాథమిక పాఠశాలను తరలిస్తే తమ పిల్లలు విద్యకు దూరం అవుతారని దొమ్మేరు ఇందిరమ్మ కాలనీవాసులు వాపోయారు. కొవ్వూరు మండలం దొమ్మేరు ఇందిరమ్మ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(స్పెషల్)ను వేరే పాఠశాలలో విలీనం చేయడంపై గ్రామస్తులు గురువారం కొవ్వూరులోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు, సర్పంచ్ తానేటి కుమారి, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు రౌతు రాణి, పొసిపో బేబి, అనిమిల్లి జ్ఙానేంద్ర ఎంఈవో కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివేవారు 33 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పాఠశాల విద్యాకమిటీ, విద్యార్థుల తల్లిందండ్రులు, సర్పంచ్ పాఠశాలల తరలించరాదని చెప్పినప్పటికీ, తాము అనుకూలంగా సంతకాలు చేసినట్టు అధికారులు నివేదిక పంపడం ఏంటని ప్రశ్నించారు. 1930లో ఏర్పడిన ఈ పాఠశాల ద్వారా దళితుల పిల్లలు విద్య నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఫౌండేషన్ స్కూల్ చేయడం వల్ల ఇక్కడ కేవలం 1,2 తరగతులు మాత్రమే మిగులుతాయని తెలిపారు. ఎంఈవో బి స్వరూప్కు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు వరిగేటి సుధాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు జి.సునీల్, కె.రాజేష్, ఎ.లక్ష్మి, యాగంటి శాంతకుమారి పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాల తరలింపుపై
ఎంఈవో కార్యాలయం వద్ద ఆందోళన