
బక్రీద్ పండగకు సర్వం సిద్ధం
● జిల్లాలో ఘనంగా ఈద్ ఉల్ అద్హా
నిర్వహణకు ఏర్పాట్లు
● సర్వమానవాళి కోసం దువా
చేయనున్న మత పెద్దలు
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): బక్రీద్ పండుగ ఈదుల్ అద్హాను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఈద్గాలతో పాటు మసీదుల్లోనూ నమాజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే శుద్ధి స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకుని ఈద్ నమాజ్ చదివేందుకు ఈద్గాలకు బయలుదేరతారు. ‘అల్లాహు అక్బర్.... అంటూ తక్బీర్ చదువుకుంటూ తద్గాలకు చేరుకుంటారు.ఈద్గాలకు వెళ్లలేని వారు సమీపంలోని మసీదులకు వెళ్లి ఈద్ నమాజు చేస్తారు. ఈద్గా, మసీదుల్లో నమాజు చేయించే ఖాజీలు, మౌల్వీలు తమ ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం దువా చేస్తారు. సర్వమానవాళి శాంతి కోసం, జీవితంలో చేసిన పాపాల విముక్తి కోసం అల్లాహ్ను వేడుకుంటారు. నమాజు, దువా అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ కరచాలనం, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొందరు బక్రీద్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. మరి కొందరు ఈద్కు ఒక రోజు ముందు రోజూ ఉపవాసం పాటిస్తారు. ఇంకొందరు పండగ రోజు ఈద్ నమాజు పూర్తయ్యే వరుకు ఏమీ తినకుండా వెళ్లి ప్రార్థనలు చేస్తారు. శుభాలు జరగాలని కోరుకుంటారు.
త్యాగాలకు ప్రతీక....
ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ చేసుకుంటారు. ఇదే రోజు పవిత్రమైన పుణ్యక్షేత్రం మక్కా ప్రాంతంలో హజ్ జరుగుతుంది. మక్కాలోని కాబా సమీపంలో ఉన్న అర్భత్ మైదానంలో ఉన్న పెద్ద మసీదులలో బక్రీద్ నమాజ్ చేయడంతో పాటు పలు నియమ నిబంధనలతో ప్రార్థనలు చేస్తే హజ్ పూర్తవుతుంది. అల్లాహ్ సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో ఇది ఒకటి. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సూచించారు. అవే ఈమాన్, రోజుకు ఐదు పూటల నమాజ్, రోజా, జకాత్, హజ్యాత్ర, ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా హజ్ చేయాలని ప్రస్తావించారు. ఇది 40 రోజుల యాత్ర.
ఈద్గాలతో పాటు మసీదుల్లో ఏర్పాట్లు
రాజమహేంద్రవరంలో రాయల్ మాస్క్, జామా మసీదు, అబుబకర్ షామసీద్, బిలాల్ మసీద్, జాంపేట మసీదు, దానవాయిపేట మసీదు, పలు ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.