ముందస్తు సాగుకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు సాగుకు శ్రీకారం

Jun 7 2025 12:18 AM | Updated on Jun 7 2025 12:18 AM

ముందస

ముందస్తు సాగుకు శ్రీకారం

దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో వేస్తున్న సార్వా వరినాట్లు

మడి నుంచి ఆకు తీస్తున్న కూలీలు

మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభం

బోర్ల కింద ముమ్మరంగా ఆకుమడులు

అందుబాటులో 4,550 క్వింటాళ్ల విత్తనాలు

154 హెక్టార్లలో నారుమడులు

77,820 హెక్టార్లలో సార్వా వరి సాగు

దేవరపల్లి: దాళ్వాలో పండించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకుండానే ముందస్తు సార్వా సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. బోర్ల కింద ముమ్మరంగా వరి ఆకుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల నారుమడులు వేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం ఆనకట్ట నుంచి కాలువలకు నీరు విడుదల చేయడంతో డెల్టాలో రైతులు వరి నారుమడులు వేస్తుండగా, మెట్ట ప్రాంతంలోని రైతులు బోర్లు కింద ఆకుమడులు వేస్తున్నారు. చెరువులు, తాడిపూడి కాలువ కింద సాగుకు అవసరమైన నారును బోర్ల కింద ఆకుమడులు వేసి పెంచుతున్నారు. మే నెల రెండవ వారంలో వేసిన నారు నాటడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది రైతులు వారం రోజుల నుంచి నారుమడులు వేస్తున్నారు.

అధిక దిగుబడి వచ్చే వంగడాల సాగు

ఖరీఫ్‌లో అధిక దిగుబడులు వచ్చే వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని నారుమడులు వేస్తున్నారు. సన్న రకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, బీపీటీ–2270, బీపీటీ–2846, ఎల్‌ఎల్‌ఆర్‌–3238 రకాలతో పాటు ఎంటీయూ 1318 వంటి నూతన రకాల వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ వంగడాలతో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తున్నట్టు రైతులు తెలిపారు.

రైతులకు అందుబాటులో విత్తనాలు

వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవసరమైన వరి విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ఖరీఫ్‌లో జిల్లాలో 77,820 హెక్టార్లలో రైతులు వరి పంట వేస్తున్నారు. దీనికి 38,910 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. దీనిలో 400 క్వింటాళ్ల వరకు రాయితీపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ పంట కాలానికి దాదాపు 3,845 హెక్టార్లలో వరి నారుమడి వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 154 హెక్టార్లలో నారుమడి వేశారు. 80 నుంచి 90 శాతం వరకు వరి రైతులు సొంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి తీసుకుని వినియోగిస్తున్నారు. 10 నుంచి 20 శాతం విత్తనాలు వివిధ మండలాల్లో లైసెన్సు కలిగిన విత్తన అమ్మకందారులు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 4,550 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

మెట్ట ప్రాంతంలో ప్రారంభమైన వరినాట్లు

కొవ్వూరు డివిజన్‌ పరిధిలోని దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో వరినాట్లు ప్రారంభించారు. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో రైతు ధుమంతరావు వెంకటసుబ్బారావు తన ఏడు ఎకరాల పొలంలో రెండు రోజుల నుంచి వరినాట్లు వేశారు. నల్లజర్ల మండలం పోతవరంలో వరినాట్లు ప్రారంభించారు. ముందస్తుగా రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఒకపక్క దాళ్వా పంట కొనుగోళ్లు పూర్తికాలేదు, మరొక పక్క ముమ్మరంగా ఆకుమడులు వేస్తుండగా, పై రెండు మండలాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. నూతన వంగడం ఎంటీయూ–1318 రైతులు సాగు చేస్తున్నారు.

నూతన వంగడం సాగు

ఖరీఫ్‌లో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే నూతన వంగడం ఎంటీయూ–1318 నారుమడి మే నెల 19న బోరు కింద వేశాను. 18 రోజుల్లో ఆకు సిద్ధం కావడంతో రెండు రోజుల నుంచి ఏడు ఎకరాల్లో నాట్లు వేశాను. 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వస్తుంది. ముందస్తు సాగు చేయాలనే ఉద్దేశంతో ముందుగా నాట్లు వేశాను. మృగశిర కార్తెలో నాట్లు వేయడం ఆనవాయితీ. ఈ కార్తెలో వరినాట్లు వేస్తే దిగుబడులు ఆశాజనకం ఉంటాయని నమ్మకం.

– ధుమంతరావు వెంకటసుబ్బారావు(బుజ్జి), రైతు, ధుమంతునిగూడెం, దేవరపల్లి మండలం

80,918 హెక్టార్లలో ఖరీఫ్‌ పంటలు

జిల్లాలో 2025–25 పంట కాలానికి 80,918 హెక్టార్లలో వివిధ రకాల వ్యవసాయ పంటలు వేసే అవకాశం ఉంది. దీనిలో 77,820 హెక్టార్లు వరి, 2,595 హెక్టార్లు మినుము, 181 హెక్టార్లు మొక్కజొన్న, ఇతర పంటలైన పత్తి, వేరుశనగ పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది. వరి సాగుకు అవసరమైన విత్తనాలు జిల్లాలోని 19 మండలాల్లో 4,5550 క్వింటాళ్లు అందుబాటులో ఉంచాం. 3,845 హెక్లార్లలో వరి నారుమడులు వేయవలసి ఉంది. ఇప్పటి వరకు 154 హెక్టార్లలో నారు మడులు వేశారు. ఎక్కువగా రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలను సాగు చేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రస్తుత నివేదికల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల సకాలంలో వర్షాలు పడతాయి. అక్కడక్కడా బోర్ల కింద నాట్లు వేస్తున్నారు.

– ఎస్‌.మాధవరావు,

జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం

ముందస్తు సాగుకు శ్రీకారం1
1/3

ముందస్తు సాగుకు శ్రీకారం

ముందస్తు సాగుకు శ్రీకారం2
2/3

ముందస్తు సాగుకు శ్రీకారం

ముందస్తు సాగుకు శ్రీకారం3
3/3

ముందస్తు సాగుకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement