
అమలాపురంలో సైబర్ మోసం
అమలాపురం టౌన్: ఓ సైబర్ నేరగాడు గ్రీజు డబ్బా కొనుగోలు పేరుతో షాపు యజమానికి రూ.24 వేలకు టోకరా వేసిన ఉదంతమిది. స్థానిక శ్రీనివాస ఏటిగట్టు ప్రాంతంలో బ్రహ్మం రేడియేటర్స్ అండ్ మొబైల్ షాపు యాజమాని టి.సత్యనారాయణకు ఓ ఆగంతకుడు బుధవారం సాయంత్రం హిందీలో మాట్లాడుతూ ఫోన్ చేశాడు. 5 కేజీల గ్రీజు డబ్బా కావాలని ధర అడిగాడు. రూ.వెయ్యి అని చెప్పగానే మీ షాపునకు మా మనిషిని పంపుతాను, డబ్బా అతని చేతికివ్వమని ఆగంతకుడు షాపు యజమానికి చెప్పాడు. మీకు రూ.వెయ్యి ఫోన్ పే చేస్తున్నానని చెప్పి కొద్దిసేపటికి మీ అకౌంట్లో పొరపాటున రూ.10 వేలు సొమ్ము వేశాను. మీకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి తీసుకుని మిగిలిన రూ.9 వేలు మీ ఫోన్కు ఓ స్కానర్ పంపిస్తున్నాను, దానికి డబ్బు పంపమని చెప్పాడు. అకౌంట్లో డబ్బు పడిందో లేదో చూడకుండా కేవలం మెసేజ్కు స్పందించిన షాపు యాజమాని రూ.9 వేలు ఆగంతకుడు పంపించిన స్కానర్కు పంపించేశారు. తర్వాత కొద్ది సేపటికి మీ ఫోన్కు మరో రూ.15 వేలు పొరపాటున పంపించాను, ఆ డబ్బును కూడా స్కానర్లో పంపించండని మెసేజ్ పెట్టాడు. నేనెక్కడో ఉన్నాను. ఇక్కడ డబ్బు ఫోన్ పే చేయాలని, అర్జంటుగా నాకు డబ్బు పంపించాలని షాపు యాజమానిని ఆగంతకుడు నమ్మించాడు. షాపు యాజమాని రూ.15 వేలు కూడా స్కానర్ ద్వారా పంపించేశారు. దీంతో మొత్తం రూ.24 వేలు ఆగంతకుడు పంపిన స్కానర్కు పంపించారు. తర్వాత ఫోన్ పేలో అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకుంటే రూ.24 వేలు డ్రా అయినట్లు కనిపించింది. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్టు షాపు యజమాని గ్రహించి సైబర్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు.
గ్రీజు డబ్బా కొనుగోలు పేరుతో
రూ.24 వేలకు టోకరా