
ప్చ్.. నిరాశే..
రైతులను ఆదుకున్న
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014లో ప్రతిపక్ష నేతగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గుంటూరు బోర్డు కార్యాలయం వద్ద రైతులకు అండగా ధర్నా చేస్తానని ప్రకటించారు, అనంతరం కిలోకు రూ.10 నుంచి రూ.17 వరకూ ధర పెరిగి, రైతులకు మేలు జరిగింది.
● 2020 పంట కాలంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో పడి, రైతుల వద్ద లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించారు. మార్క్ఫెడ్కు రూ.200 కోట్లు మంజూరు చేసి, సుమారు 16 మిలియన్ల కిలోల పొగాకును కొనుగోలు చేయించారు.
● 2004లో పాదయాత్ర చేపట్టిన అప్పటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2005–06 పంట కాలంలో పండించిన పొగాకును కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించారు.
● పుంజుకోని పొగాకు మార్కెట్
● లో గ్రేడ్కు ట్రేడర్లు నో ● నాణ్యతకే ప్రాధాన్యం
● గిట్టుబాటు ధర దక్కక రైతుల గిలగిల
దేవరపల్లి: రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు రెండు నెలలు దాటింది. ఇప్పటికీ మార్కెట్ పుంజుకోవడం లేదు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండే పొగాకు కొనుగోళ్లను ఈ ఏడాది మార్చి 24న ప్రారంభించారు. ఇప్పటి వరకూ 59 రోజులు వేలం నిర్వహించినా ధరలో పెరుగుదల లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో, వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లు తక్కువగా ఉంటున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం నాటికి సుమారు 50 నుంచి 55 శాతం పొగాకు విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం అది 25 శాతానికే పరిమితమైంది.
రైతు.. కుదేలు
గత ఏడాది పొగాకుకు ఊహించని ధర పలికి, మంచి లాభాలు రావడంతో రైతులు కుబేరులయ్యారు. కిలోకు రూ.410 ధర లభించడంతో ఎకరాకు దాదాపు రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో, అధిక శాతం రైతులు పొగాకు సాగుపై మొగ్గు చూపారు. కనీసం ఎకరం పొలం లేని రైతులు 5 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశారు. అధిక పెట్టుబడులు పెట్టి పంట పండించారు. తీరా పండించిన పొగాకును వేలం కేంద్రాలకు తీసుకు వెళ్లిన రైతులకు ఎదురు దెబ్బ తగిలింది. ఏటా అత్యధికంగా పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు కూడా ఈసారి అంతంత మాత్రంగానే కొంటున్నాయి. దీంతో, రైతులు సాగుకు తెచ్చిన అప్పులు గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో పొగాకు సాగుకు రూ.3 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఎకరం కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.50 వేలు, పెట్టుబడి దాదాపు రూ.1.50 లక్షలు అవుతోంది. చాలా మంది బ్యారన్కు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టి పంట పండించారు. తీరా చూస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.లక్ష నష్టం వస్తుందని రైతులు దిగులు చెందుతున్నారు. గత అప్పులకు కొత్త అప్పులు తోడవడంతో రుణభారం పెరిగిందని కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు మందగించడంతో రైతుల వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. వేలానికి వస్తున్న బేళ్లే తక్కువగా ఉండగా.. వాటిని కూడా ట్రేడర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు.
పరిమితికి మించి.. పండించి..
రైతులు 2024–25 పంట కాలంలో పరిమితికి మించి పొగాకు పండించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 59 మిలియన్ల పంటకు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసింది. గత ఏడాది వచ్చిన ధర చూసి, ఆశపడి, అధిక విస్తీర్ణంలో సాగు చేయవద్దని అధికారులు, ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులు చెబుతూనే ఉన్నారు. ఈ ఏడాది జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంట వేయాలని సూచించారు. కానీ, ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో నిషేధిత భూముల్లో కూడా రైతులు అనుమతి లేకుండా పంట సాగు చేశారు. దీంతో ఉత్పత్తి 80 మిలియన్ల కిలోలకు చేరింది. 24,450 హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, దాదాపు 40 వేల హెక్టార్లలో పంట వేసినట్టు సమాచారం. ఈవిధంగా కొనుగోలు సంస్థల అవసరానికి మించి పంట ఉత్పత్తి కావడంతో మార్కెట్ సంక్షోభంలో పడినట్టు అధికారులు చెబుతున్నారు.
తక్కువ ధరకు బ్లాక్ సాయిల్ పొగాకు
దక్షిణాదిన నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకు తక్కువ ధరకు లభించడంతో కొనుగోలు సంస్థలు అక్కడే ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. బ్లాక్ సాయిల్ పొగాకు కిలో రూ.180కి లభిస్తూండగా, ఎన్ఎల్ఎస్ పొగాకు రూ.290 నుంచి రూ.220 వరకూ పలుకుతోంది. బ్లాక్ సాయిల్, ఎన్ఎల్ఎస్ పొగాకులో నికోటిన్ శాతం సమానంగా ఉండడంతో కొనుగోలుదారులు అక్కడి పొగాకు కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఎన్ఎల్ఎస్ పొగాకు కంటే బ్లాక్ సాయిల్ పొగాకు కిలో రూ.50 నుంచి రూ.80 తక్కువకు వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, పంట ఎక్కువగా పండినందున కొనుగోలు సంస్థలు సిండికేట్గా మారి ఇబ్బంది పెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ఖరారు కాని ఎగుమతి ఆర్డర్లు
గుంటూరు ప్రధాన కేంద్రంగా ఉన్న పొగాకు బోర్డు తన పరిధిలో వేలం కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు, ట్రేడర్కు మధ్యవర్తిగా పని చేస్తుంది. దీనికి గాను రైతు, ట్రేడర్ నుంచి కిలోకు చెరొక రూపాయి చొప్పున కమీషన్ తీసుకుంటుంది. పంట ధరను బోర్డు నిర్ణయించదు. మార్కెట్లో డిమాండ్, సరఫరాను బట్టి ధర వస్తుంది. పొగాకు ఎగుమతి ఆర్డర్లు ఇంత వరకూ ఖరారు కాలేదు. ప్రధాన ఎగుమతి సంస్థలు పొగాకు శాంపిల్స్ను వివిధ దేశాల్లోని సిగరెట్ తయారీ సంస్థలకు పంపించాయి. మొదట పంపిన శాంపిల్స్ వారికి నచ్చకపోవడంతో రెండోసారి మళ్లీ పంపించారు. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీల ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించి పొగాకును పరిశీలించి వెళ్లారు. త్వరలో ఆర్డర్లు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
రూ.425.62 కోట్ల పొగాకు విక్రయాలు
ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.425.62 కోట్ల విలువైన పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.290, కనిష్టంగా రూ.200, సగటున రూ.274.95 చొప్పున ధర పలికింది. ట్రేడర్లు 1,19,775 బేళ్లు కొనుగోలు చేశారు. పొగాకును నాలుగు గ్రేడులుగా విభజించి రైతులు బేళ్లు తయారు చేస్తారు. మొదటి గ్రేడు పొగాకు కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు మిగిలిన గ్రేడ్ల పొగాకు కొనడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
త్వరగా అమ్ముకోవాలి
వేలానికి బేళ్లు తక్కువగా వస్తున్నాయి. కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. చాలా మంది రైతులు ఇప్పటి వరకూ కిలో పొగాకు కూడా అమ్మలేదు. వారికి నోటీసులిచ్చాం. వర్షాలు పడితే పొగాకు నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం మీడియం, బ్రైట్ గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకూ 15.48 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. అమ్ముడుపోతున్న గ్రేడ్ పొగాకును వేలానికి తీసుకురావాలి. రైతులు తమ వద్ద మున్న పొగాకును త్వరితగతిన అమ్ముకోవాలి.
– జీఎల్కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం
జాగ్రత్తగా అమ్ముకోవడం మంచిది
రాష్ట్రంలో 167 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 240 మిలియన్ల కిలోలు పండింది. బర్లీ పొగాకు అధికంగా పండింది. అంతర్జాతీయంగా ప్రతి దేశంలోనూ పంట ఉత్పత్తి పెరిగింది. ఈ పరిస్థితిని అధికారులు, కంపెనీలు ముందు నుంచీ చెప్పినా ఒక్క రైతూ వినలేదు. బ్యారన్కు (4 ఎకరాల్లో) 41.25 క్వింటాళ్లు పండించాల్సి ఉండగా, 100 క్వింటాళ్లు పండించిన రైతులున్నారు. ఈ ఏడాది దెబ్బ తిన్న రైతులు ఎక్కువగానే ఉన్నారు.
– గద్దే శేషగిరారావు, మాజీ వైస్ చైర్మన్, పొగాకు బోర్డు

ప్చ్.. నిరాశే..

ప్చ్.. నిరాశే..

ప్చ్.. నిరాశే..