
లేబర్ కోడ్స్ రద్దుకు వచ్చే నెల 9న సమ్మె
రాజమహేంద్రవరం సిటీ: కార్మిక హక్కులు హరించేలా రూపొందించిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా వచ్చే నెల 9న నిర్వహించనున్న కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.పవన్ పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో సమ్మె వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన సార్వత్రిక సమ్మె జరుగుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, ఇప్పుడున్న హక్కులు కూడా లేకుండా కార్మికులను పూర్తిగా అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పైకి మాత్రం చట్టాలను ఆధునీకరిస్తున్నామని చెబుతున్నా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరుతో రద్దు చేసే కుట్ర చేస్తోందని. దీనిని కార్మిక వర్గం తిప్పికొట్టాలని అన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కేఎస్వీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీహెచ్ ప్రారంభోత్సవానికి
ఏర్పాట్లు పూర్తి
రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీహెచ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా లేదా ప్రత్యక్షంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఆర్టీహెచ్ కేంద్రాన్ని సమన్వయ శాఖల అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, అక్కడి నుంచి వర్చువల్గా ధవళేశ్వరంలోని ఆర్టీహెచ్ను ప్రారంభిస్తారని చెప్పారు. ఒకవేళ నేరుగా హాజరైనా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆర్టీహెచ్ను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ, విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలతో సీఎం సంభాషించి, వారి ఆలోచనలను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్, నగర పాలక సంస్థ ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఇన్చార్జి తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పీజీఆర్ఎస్
రాజమహేంద్రవరం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవా రం కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 నంబర్ ద్వారా, 1100 నంబర్తో ‘మీకోసం కాల్ సెంటర్’కు కూడా నేరుగా అర్జీ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యాన అర్జీలు స్వీకరిస్తారన్నారు.
యోగాపై నేడు ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా సాధకులతో సోమవారం జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాసారు. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా యంత్రాంగం, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, ఆయుష్, వైద్య, ఆరోగ్య, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి ఉదయం 7 గంటలకు స్థానిక వై జంక్షన్ నుంచి దేవీచౌక్ వరకూ, తిరిగి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు.
172 మంది విద్యార్థులకు
షైనింగ్ స్టార్స్ అవార్డులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలో 48 మంది ఇంటర్, 124 మంది పదో తరగతి విద్యార్థులకు సోమవారం షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులు అందజేస్తున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన ఈ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుతో పాటు రూ.20 వేల నగదు పురస్కారం, ధ్రువపత్రం అందజేస్తామన్నారు.