
కన్నుల పండువలా శ్రీపుష్పయాగం
దివ్యాంగ హక్కుల వేదిక సమావేశం రేపు
09ఆర్జడ్ఎల్82
స్వామి వారి శ్రీపుష్పయాగంలో పాల్గొన్న భక్తులు
● వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు
● బాల బాలాజీ స్వామి వారి
కల్యాణోత్సవాలు సంపూర్ణం
మామిడికుదురు: శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ అయిదు రోజుల పర్యంతం కనుల పండుగలా సాగిన అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు సోమవారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్పాల సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీబాల బాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉఽభయ దేవేరులతో కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. పసుపు, కుంకుమ, రవికల గుడ్డ అందజేశారు. ముందుగా సుప్రభాత సేవతో అయిదవ రోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. స్వామి వారి సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చోర సంవాదం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దేవస్ధానం ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్యులు చలమచర్ల వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. బాల భోగం, నివేదన, వేదపారాయణ హృద్యంగా సాగాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి, తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్ధానం ఽకార్య నిర్వహణాధికారిణి ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కనుల పండువలా జరిగాయి.
రామచంద్రపురం రూరల్: అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు సోమవారం విలేకరులకు తెలిపారు.
ఈ సమావేశానికి వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పాల్గొననున్నారని తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే విధంగా జిల్లా, మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.