రత్నగిరిపై మరో అపచారం! | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై మరో అపచారం!

Jun 9 2025 12:08 AM | Updated on Jun 9 2025 12:08 AM

రత్నగిరిపై మరో అపచారం!

రత్నగిరిపై మరో అపచారం!

సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం

ముందు భారీ వివాహ సెట్టింగ్‌

షెడ్డు సగం ఆక్రమించి

అట్టహాసంగా వివాహం

భక్తులకు ఇబ్బందులు

అన్నవరం: సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు సాధారణంగా దేవస్థానం వైదిక కార్యక్రమాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలూ నిర్వహించరు. అది కూడా వార్షిక కల్యాణ మండపాన్ని మూసివేసేలా ఎటువంటి సెట్టింగులనూ అనుమతించరు. వివాహ ముహూర్తాల సమయంలో ఆ కల్యాణ మండపం ముందున్న విశ్రాంతి మండపంలో పేద, మధ్యతరగతి వారు చిన్నచిన్న మండపాలు వేసుకుని వివాహాలు చేసుకుంటారు. ఆ షెడ్డు నిర్మించక ముందు నుంచే అక్కడ అలా వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడూ పెద్ద పెద్ద సెట్టింగ్‌లు వేసి వివాహాలకు అనుమతి లేదు. కానీ, ఆదివారం ఉదయం మాత్రం యలమంచిలికి చెందిన వారు స్వామివా రి వార్షిక కల్యాణ వేదిక ముందు చాలా పెద్ద సెట్టింగ్‌ వేసి అట్టహాసంగా వివాహం చేశారు. వార్షిక కల్యాణ వేదిక ముందు దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి షెడ్డును కుర్చీలు వేసి, సగం వరకూ ఆక్రమించేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అక్కడకు రాకుండా బారికేడ్లు కూడా కట్టేశారు. ఉదయం 6 నుంచి 11.30 గంటల వరకూ ఈ వివాహ వేడుకలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకూ ఆ సెట్టింగ్‌ అలాగే ఉంది. దీంతో మిగిలిన సగం షెడ్డులోనే సేద తీరుతూ భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పక్కనే ఉన్న రామాలయంలో దర్శనానికి వచ్చిన వారు కూడా అవస్థలు పడ్డారు. ఈ వివాహ సెట్టింగ్‌ వలన పండితులు నిర్వహించిన సూర్య నమస్కారాలు కూడా భక్తులకు కనిపించలేదు. పండితులు ఆ సెట్టింగ్‌ వెనుకనే ఉండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విశ్రాంతి షెడ్డును ఇప్పటి వరకూ ఈవిధంగా ఆక్రమించి, వివాహం జరిపిన సందర్భం లేదు. ఈవిధంగా చేయడానికి గతంలో ఎప్పుడూ ఎవ్వరూ అనుమతి కూడా ఇవ్వలేదు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో వివాహం చేసుకోవడానికి నిర్వాహకులు దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించారని అధికారులు చెప్పారు. వార్షిక కల్యాణ మండపం ముందు భాగాన్ని ఈ విధంగా ఆక్రమించి, వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం అపచారమేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement